కేరళలో మరోసారి నరబలి కలకలం.. ఎస్కేప్ అయిన మహిళ..!

Update: 2022-12-23 00:30 GMT
కేరళలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన ఘటన మరవకముందే మరోసారి ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూడటం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో ఓ డాక్టర్ దంపతులు త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో ఓ మంత్రగాడిని కలిశారు. ఈ క్రమంలోనే మంత్రగాడితో కలిసి తిరువళ్లు ప్రాంతంలో ఇద్దరు మహిళలను నరబలిచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా మరోసారి అదే ప్రాంతంలో నరబలికి యత్నించడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. పూజ పేరుతో మహిళను మాంత్రికుడు నర బలిచ్చేందుకు ప్రయత్నంగా ఆమె ఎస్కేప్ అయింది. కొన్ని రోజులు భయంతో బయటకు రాని ఆ మహిళ ఓ స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..! కర్ణాటకలోని కొడుకు జిల్లాకు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఆమె భర్త తరుచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య దూరం పెరిగి భర్తతో విడిగా ప్రస్తుతం కొచ్చిలో ఉంటుంది. తన సమస్యలు పరిష్కారం కావడం లేదని.. ఏం చేయాలో తెలియడం లేదని స్నేహితుల దగ్గర వాపోయింది.

భర్తను వదిలేసిన మహిళకు ఓ స్నేహితుడు ఇటీవల బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు తిరువళ్లులోని ఓ మంత్రగాడి గురించి చెప్పాడు. అతడిని కలిస్తే నీ సమస్యలు తీరుతానని చెప్పడంతో ఆమె ఇటీవల మంత్రగాడిని కలిసింది. ఈ సమయంలోనే తన స్నేహితుడు.. మంత్రగాడు ఆ రాత్రి పూజ పేరుతో ఆమెను బలిద్దామని మాట్లాడుకున్నారు.

ఈ మాటలను విన్న మహిళ పూజ మధ్యలో నుంచి లేచి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల పాటు భయంతో రహస్య ప్రాంతంలో తలదాచుకున్న మహిళ మరో స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసిన ఏడీజీపీకి సమర్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంత్రగాడు.. మాయమాటలు చెప్పిన మహిళ స్నేహితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News