2013లో కేసీఆర్ కు చెప్పిన మాటకే ఇప్పటికి కట్టుబడి ఉన్నాడట

Update: 2020-11-16 14:10 GMT
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటమే కాదు.. గులాబీ బాస్ కు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల ఫలితానికి మించి.. ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసిందని చెప్పాలి. అన్నింటికి మించి.. రఘనందన్ నోటి నుంచి అప్పుడెప్పుడో వచ్చిన మాటలు.. ఇప్పుడు సరికొత్తగా మారటమే కాదు.. అందరి నోళ్లలో నానేలా చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లోని ఒక ఫైర్ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. 2013లో తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపిన వైనాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కు తానో మాట చెప్పినట్లు చెప్పారు. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రం మాత్రమే కోయగలుతాడని.. ఆ మాటకు తాను ఇప్పటికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అనేందుకు ఎవరూ సాహసించని వ్యాఖ్యలు రఘునందన్ నోటి నుంచి రావటం గమనార్హం.తనకు పదవులున్నా.. లేకున్నా.. రాజకీయంగా ఎదిగినా.. ఎదగకున్నా.. ఉన్నతమైన పదవులు రానప్పటికీ తనకున్న నల్లకోటుతో కేసీఆర్ ను..ఎక్కడికి పంపాలో అక్కడికే పంపుతానని పేర్కొన్నారు.

భగవంతుడి ఆశీర్వాదం.. కార్యకర్తల బలం ఇచ్చారని.. తానిప్పుడు కేసీఆర్ కూర్చున్న అసెంబ్లీకి వెళుతున్నట్లు చెప్పిన ఆయన.. తాను2013లో ఏ మాట అయితే చెప్పానో.. ఆ మాటకుకట్టుబడి ఉన్నానని.. అది తప్పనిసరిగా జరిగి తీరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి తన పోటీ.. లక్ష్యం హరీశ్.. కేటీఆర్ కాదని.. కేసీఆర్ అన్నట్లుగా ఉన్న రఘునందన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.



Tags:    

Similar News