అయితే రేపే.. లేకుంటే 500 ఏళ్లలోనంట

Update: 2016-07-21 17:30 GMT
ఒక మహా ప్రళయం పొంచి ఉందని చెబుతున్నారు. ఇదెంత ప్రళయం అంటే.. ఈ మధ్య కాలంలో ఎవరూ చూడనంత భారీ విలయాన్ని ఈ ప్రళయం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. బంగ్లాదేశ్.. మయన్మార్ తో పాటు ఉత్తర భారతంలో చోటు చేసుకునే పెను భూకంపం ధాటికి పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇదెప్పుడు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ప్రశ్న వేస్తే.. అయితే.. రేపే రావొచ్చని లేకుంటే 500 ఏళ్లలో ఎప్పుడైనా రావొచ్చని చెబుతున్నారు.

ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ల వద్ద గడిచిన 13 ఏళ్లలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయం అర్థమైనట్లుగా చెబుతున్నారు. ఈ మహా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 8.2 నుంచి 9 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇండో బర్మీస్ ఆర్క్ గా పిలిచే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ మధ్యలో ఏడాదికి 46 మిల్లీ మీటర్ల వ్యత్యాసంలో వస్తున్న మార్పులే ఈ భారీ ప్రళయానికి కారణంగా చెబుతున్నారు. ఈ భూకంప ప్రభావం దాదాపు 14 కోట్ల మంది ప్రజల మీద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం కాని చోటు చేసుకుంటే భారత్ లోని 107 పట్టణాల ప్రజలు ప్రభావానికి గురి అవుతారని చెబుతున్నారు. వీలైనంత వరకూ ఇలాంటి ప్రళయాలు రాకుండా ఉండాలని కోరుకుందాం. అంతకు మించి మనుషులుగా మనం ఇంకేం చేయగలం?
Tags:    

Similar News