ఆ జాబితాలో అమెరికా కంటే భారత్ టాప్

Update: 2020-09-24 17:00 GMT
ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా జరగనున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బిడెన్ ల మధ్య ప్రచార పోరు కొనసాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు 21 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధిక ప్రాధాన్యమున్నప్పటికీ....ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల నమోదులో మాత్రం అగ్రరాజ్యం కన్నా భారత్ ఎంతో ముందుంది. 2019 ఎన్నికల నాటికి మన దేశంలో దాదాపు 91 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఎన్నికలు జరిగిన దేశాలలో అధికారికంగా నమోదైన ఓటర్ల సంఖ్య ప్రకారం ఈ గణాంకాలను వెల్లడించింది.

మనదేశానికి దరిదాపులో కూడా అగ్రరాజ్యం లేదని, అమెరికా జనాభా కన్నా భారత్ లోని ఓటర్ల సంఖ్య మూడు రెట్లు అధికమని వెల్లడించింది.2019లో జరిగిన ఇండోనేషియా ఎన్నికల నాటికి దాదాపుగా 19 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ దాదాపుగా 14 కోట్ల మంది ఓటర్లతా జాబితాలో తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా(11కోట్లకు పైగా ఓటర్లు), పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్(10కోట్లకు పైగా ఓటర్లు) ఉన్నాయని వెల్లడించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇటు జనాభాలో చైనా తర్వాతి స్థానంలో కొనసాగుతోందని తెలిపింది.
Tags:    

Similar News