పాక్ వార్నింగ్ నిజ‌మైంది..పుల్వామాలో తాజా ఉగ్ర‌దాడి!

Update: 2019-06-18 04:25 GMT
జ‌మ్ముక‌శ్మీర్ లో మ‌రో ఉగ్ర‌దాడి చోటు చేసుకుంది. రోటీన్ కు భిన్నంగా ఈసారి ఉగ్ర‌దాడి గురించి భార‌త స‌ర్కారుకు పాకిస్తాన్ ముందే హెచ్చ‌రించింది. అంతా అలెర్ట్ గా ఉన్న‌ప్ప‌టికి పుల్వామా జిల్లాలోని అరిహ‌ల్ లో ఆర్మీ వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకొని బాంబుదాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు..ఇద్ద‌రు పౌరులు గాయ‌ప‌డ్డారు. ఈ బాంబుదాడికి శ‌క్తివంత‌మైన ఐఈడీని ఉప‌యోగించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఫిబ్ర‌వ‌రి 14న న‌ల‌భై మంది సీఆర్ఫీఎఫ్ అధికారుల్ని బ‌లి తీసుకున్న పుల్వామా ఉగ్ర‌దాడి జ‌రిగిన ప్రాంతానికి కేవ‌లం 27 కిలోమీట‌ర్ల దూరంలో తాజా ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం. అదృష్ట‌వ‌శాత్తు ఉగ్ర‌దాడికి గురైన ఆర్మీ వాహ‌నం బుల్లెట్.. మైన్ ఫ్రూప్ వాహ‌నం కావ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పించింది.

44వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఈ వాహ‌నం బుల్లెట్ ఫ్రూప్ కావ‌టంతో చిన్న చిన్న గాయాలు త‌ప్పించి మ‌రింకే ప్ర‌మాదం చోటు చేసుకోలేదు. దాడి జ‌రిగిన వెంట‌నే అద‌న‌పు బ‌ల‌గాల్ని తీసుకొచ్చి గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఉగ్ర‌దాడి విఫ‌ల‌మైంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. బాంబుదాడి అనంత‌రం స్థానికంగా సోదాలు నిర్వ‌హించారు.

గ‌తానికి వ‌ర్త‌మానానికి వ్య‌త్యాసం ఏమంటే.. తాజా దాడికి ముందు భార‌త్ ను పాక్ హెచ్చ‌రించింది. ఉగ్ర‌దాడుల‌కు అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అల్ కాయిదాకు అనుబంధ సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాది జ‌కీర్ మూసాను చంపినందుకు ప్ర‌తీకారంగా భార‌త్ లో దాడులు జ‌రుగుతాయ‌ని.. ఉగ్ర‌వాదులు అందుకు త‌గ్గ‌ట్లు ప్లాన్ చేస్తున్న స‌మాచారం త‌మ‌కు అందిన‌ట్లుగా పాక్ పేర్కొంది.

ఉగ్ర‌ఘ‌ట‌న‌ల విష‌యంలో భార‌త్ ను ముందే హెచ్చ‌రించ‌టం పాక్ ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌లేదు. ఈసారి అందుకు భిన్నంగా చేయ‌టానికి కార‌ణాలు చూస్తే.. ఉగ్ర‌వాదుల‌కు పాక్ షెల్ట‌ర్ జోన్ లా మారింద‌న్న మాట అంత‌ర్జాతీయంగా ఆ దేశ ఇమేజ్ ను దారుణంగా ప్ర‌భావితం చేస్తోంది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే ముంద‌స్తుగా హెచ్చ‌రిక చేసి ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు తాము వ్య‌తిరేక‌మ‌న్న సందేశాన్ని ఇవ్వ‌టం కోస‌మే తాజా ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌న్న అంచ‌నా ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News