అమరావతి.. ఆల్ ఇన్ వన్

Update: 2015-07-27 11:36 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విద్య, వైద్య సంస్థలకు సీడ్ కేపిటల్ లోనే సింగపూర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. జనాభా ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు 92 హెక్టార్లు కూడా కేటాయించారు. రాజధానిలో వృత్తి విద్యకు పెద్దపీట వేస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్, నర్సింగ్ కాలేజీలను నెలకొల్పుతారు. వీటికి దాదాపు 32 హెక్టార్లను కేటాయించారు.

రాజధాని నగర జనాభా అవసరాల మేరకు ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనిని 6.3 హెక్టార్లలో.. జిల్లా స్థాయి ఆస్పత్రిని ఆరు హెక్టార్లలో నిర్మిస్తారు. ఇక ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి 16 హెక్టార్లు కేటాయించారు. భవిష్యత్తు అవసరాల కోసం మరో 332 హెక్టార్లను రిజర్వులో ఉంచారు. వీటన్నిటికీ ఐదు నుంచి పది నిమిషాల్లో నడిచి వెళ్లేలా ప్లాన్ చేశారు.

రాజధానిలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎనిమిది హెక్టార్లలో స్టేడియం, 20 హెక్టార్లలో డివిజనల్ స్పోర్ట్స్ సెంటర్ నిర్మిస్తారు. పౌర సేవల కోసం 4.8 హెక్టార్లలో జిల్లా కార్యాలయం నిర్మిస్తే.. పోలీసు లైన్ కోసం ఆరు హెక్టార్లు కేటాయించారు. పది హెక్టార్లలో జిల్లా స్థాయి కారాగారం ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అంతర్జాతీయ ఇండోర్ స్టేడియం, ఐకానిక్ సిటీ గ్యాలరీ, ప్రదర్శన వేదిక, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మిస్తారు.
Tags:    

Similar News