HP లోనూ ఉద్యోగాల కోత పడనుందా?

Update: 2022-11-23 16:30 GMT
గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం అతలాకుతలమైంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పాటించాయి. రవాణా వ్యవస్థ కుంటుపడటంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈక్రమంలోనే చిన్న, మధ్యతరహా కంపెనీలన్నీ మూతపడాల్సి రావడంతో వారంతా రోడ్డున పడ్డారు. అయితే ప్రముఖ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ తీసుకొచ్చి తమ ఉద్యోగులు రోడ్డున పడకుండా కాపాడుకున్నాయి.

ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలన్నీ కూడా కరోనా కాలంలో తమ ఉద్యోగులకు అండగా నిలిచాయి. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుందని అంతా భావిస్తున్న తరుణంలో బడా కంపెనీలన్నీ వరుసబెట్టి ఉద్యోగులను తొలగిస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది.

అమెరికాలోని ప్రముఖ కంపెనీలన్నీ కూడా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. దిగ్గజ కంపెనీలైన గుగూల్.. అమెజాన్.. మెటా.. ట్విట్టర్.. సిస్కో వంటి కంపెనీలన్నీ ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. రాబోయే రోజుల్లోనూ ఈ కోతలు తప్పవనే సంకేతాలను సైతం ఉద్యోగులకు పంపడటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

కంప్యూటర్లు.. ల్యాప్ ట్యాప్.. ప్రింటర్లు తయారు చేసే హెచ్పీ కంపెనీ సైతం ఈ లిస్టులో చేరింది. 2025 చివరి నాటికి తమ కంపెనీలో పని చేస్తున్న 6వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు ప్రకటించింది. కరోనా కాలంలో ప్రముఖ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించడంతో రికార్డు స్థాయిలో హెచ్పీ అమ్మకాలు చేపట్టింది.

అయితే ప్రస్తుతం వ్యాపార సంస్థలు.. ఉద్యోగులు తమ ఖర్చును తగ్గించుకునే ప్రాధాన్యం చూపుతున్నారు. దీంతో కంప్యూటర్లు.. ల్యాప్ టాప్ ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఈ ఏడాది ఎదురైన సవాళ్లే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వస్తాయని కంపెనీ పేర్కొంటుంది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సం తొలి త్రైమాసికంలో లాభాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

హెచ్పీ కంపెనీలో ప్రస్తుతం 50 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 12శాతం లేదంటే 4 నుంచి 6 వేల వరకు ఉద్యోగులను క్రమంగా వదిలించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇక కంప్యూటర్.. ల్యాప్ ట్యాప్ లు తయారు చేసే సంస్థలన్నింటి పరిస్థితి ఒకేలా ఉండటంతో ఆయా కంపెనీలు సైతం ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.

డెల్.. ఇంటెల్ లాంటి ప్రముఖ సంస్థలు సైతం హెచ్పీ బాటలో నడిచే అవకాశం ఉంది. ఇదే కనుకగా జరిగితే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎప్పుడు పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందోననని ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News