ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ పోటీ నిజ‌మేనా?

Update: 2022-07-24 01:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందనే ప్రచారం సాగుతోంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు బీజేపీ కూడా తెలంగాణలో మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తుందని.. అందుకే కోమటిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ నాయకుల‌ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని సమావేశమయ్యార‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి టీఆర్ఎస్ కు తీరని నష్టం కల్గించింద‌ని అంటున్నారు. ఆ ఫలితం తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. మునుగోడు ఉపఎన్నికలో అలాంటి సీన్ రిపీటైతే మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే ఆందోళ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే జిల్లా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఇత‌ర పార్టీ నేత‌ల‌తో మునుగోడుపై చ‌ర్చించార‌ని చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలను తెలసుకోవడంతో పాటు ఇంకా ఏం చేయోలో కూడా కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. అంతేకాకుండా గత ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్టుప్పల్ మండలం ఏర్పాటు సమస్యను గంటలోనే ప‌రిష్క‌రిస్తూ కొత్త మండ‌ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చార‌ని అంటున్నారు.

అదేవిధంగా కొన్ని నెల‌ల‌ క్రితం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే సంకేతం ఇచ్చిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

అది కూడా మునుగోడు నుంచే తాను పోటీ చేస్తానని కేసీఆర్ చెప్పారని నల్గొండ జిల్లా నేతలు అంటున్నారు. కేసీఆర్ త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గ నేతలు అప్ప‌ట్లో తీర్మానాలు కూడా చేయ‌డం గమ‌నార్హం. ఈ నేపథ్యంలో మునుగోడు నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కావడంతో.. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ సాగుతోంది.

సీఎం కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించినా.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే అని అంటున్నారు. అయితే ప్ర‌స్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజీనామా చేస్తే వచ్చేది ఉప ఎన్నిక మాత్ర‌మే. దీంతో త్వరలోనే జరగబోయే ఉప ఎన్నికలో ఎవరిని పోటీ చేయించాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఆ నియోజకవర్గ నేతలతో మీటింగ్ పెట్టారనే చర్చ సాగుతోంది.
Tags:    

Similar News