హేళన చేసే నిర్మలమ్మకు స్పీకర్ సుద్దులు చెప్పరేం?

Update: 2022-12-13 05:34 GMT
ప్రజలు వేసిన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యుల భాష ఒక కేంద్రమంత్రికి అవసరమా? వారి భాష.. యాస ఎలా ఉంటే మాత్రం.. దాన్ని వేలెత్తి చూపించాలా? హేళన చేసేలా వ్యాఖ్యలు చేయాలా? ఆత్మగౌరవం అన్నది ఉండదా? తన తల్లిభాషలో మాట్లాడే వ్యక్తి.. తనకు సంబంధం లేని మరో భాషలో మాట్లాడే వేళలో.. ఆ భాష అంత సరిగా లేకపోతే చురకలు వేయాలా? దాన్నో లోపంగా ఎత్తి చూపించాలా? విలువలతో కూడిన రాజకీయం అంటే ఇదేనా? లోక్ సభ స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషికి సభకు ఎన్నికైన ప్రతి సభ్యుడు ఒకటే అన్న చిన్న విషయాన్ని ఎలా మరుస్తారు? సభ్యుల్లో కొందరు మంత్రులుగా ఉంటారు. మరికొందరు మామూలు సభ్యులుగానే ఉంటారు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారు మిగిలిన వారికి మించి కాస్తంత పెద్ద స్థానంలో ఉంటారు.

అంత మాత్రం చేతనే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం ధర్మమేనా? ఇప్పటి రాజకీయాల పుణ్యమా అని చట్టసభల్లో సభ్యుల మధ్య గౌరవ మర్యాదల విషయంలో తేడా వచ్చేసింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఎక్కువగా ఉండగా.. పార్లమెంటులో ఫర్లేదన్న పరిస్థితి ఉంది. అలాంటి వాటికి చెక్ పెట్టేసేలా అధికార పక్షానికి చెందిన కొందరి తీరు ఉంటే.. సభా మర్యాదను కాపాడటంలో అందరూ ఒకేలా వ్యవహరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న వారు చెప్పాలి కదా? అలా చెప్పక పోవటం సరైనదేనా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభా సమావేశాల్లో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవటంపై రేవంత్ హిందీలో ప్రశ్న వేశారు. దీనికి నిర్మలమ్మ వ్యంగ్యంగా స్పందించారు. తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి పేలవమైన హిందీలో మాట్లాడారు. అందుకు నేను కూడా పేలవమైన హిందీలోనే జవాబు ఇస్తున్నానంటూ నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్య షాకింగ్ గా మారింది.

దీనికి రేవంత్ కూడా అంతే ధీటుగా రియాక్టు అవుతూ.. ''ఆర్థిక శాఖా మంత్రినా భాష బాగాలేదని కామెంట్ చేశారు. నేను శూద్రిడ్రి కాబట్టి స్వచ్ఛమైన హిందీ రాదు. ఆమె బ్రాహ్మణవాది కాబట్టి స్వచ్ఛమైన హిందీ వస్తుందేమో? అదేమీ నాకు సమస్య కాదు' అంటూ బదులిచ్చారు. దీనికి స్పందించిన నిర్మలా సీతారామన్ రియాక్టు అవుతూ.. తనది కూడా పేలవమైన హిందీయేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాస్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు.

సభలో కుల మతాల ప్రస్తావన తీసుకురాకూడదని.. ఎవరైనా ఆ పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంలో స్పీకర్ నోటి నుంచి వచ్చిన మాటను ఎవరైనా సమర్థిస్తారు. రేవంత్ కు హెచ్చరించిన సమయంలోనే.. దీని మొత్తానికి కారణమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హేళన మాటల్ని ప్రస్తావించి సూచన చేస్తే స్పీకర్ స్థానానికి మరింత వన్నె వచ్చేది కదా? అయినా.. భారతదేశం లాంటి దేశంలో ఎన్నో యాసలు ఉన్నాయి. హిందీ బాగా మాట్లాడటం.. మాట్లాడకపోవటం ఒక ప్రజాప్రతినిధికి విషయం కాదు.

దాన్ని ఎత్తి చూపటం ద్వారా కేంద్ర మంత్రి ఏం ఆశించారు. తనకు కూడా పేలవమైన హిందీనే వచ్చు అంటూ తర్వాత చెప్పిన ఆమె.. అలాంటప్పుడు ఎదుటోళ్లను హేళన చేయటం ద్వారా సాధించిందేంటి? ఢిల్లీ అధికార అహంకారాన్ని ప్రదర్శించటం ఎంతవరకు సబబు? అన్నది  ప్రశ్న. రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటలో తప్పు లేదని చెప్పటం లేదు. కానీ.. దానికి కారణం ఎవరన్నది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా? ఆ విషయాన్ని స్పీకర్ గుర్తిస్తే మరింత బాగుండేది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News