తుమ్మల బీజేపీలో చేరబోతున్నారా?

Update: 2022-09-05 15:30 GMT
ఉమ్మడి ఖమ్మం జిల్లాను కంటిచూపుతో ఏలిన తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎందుకు కొరకరాని నేతగా మారిపోయారు. అటు టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోక.. పదవి ఇవ్వకపోవడంతో ఉత్సవ విగ్రహంగా మారారు. ఖమ్మం నుంచి యువ మంత్రిని.. గెలిచిన ఏకైక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో తుమ్మల చేసేదేం లేకుండాపోయింది.

రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు బలమైన నేతగా పేరుంది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు. మంత్రిగా వుండి కూడా, గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మల నాగేశ్వర్ రావు దారుణంగా ఓడిపోవడంతో పరపతి దెబ్బతింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవీ లేక సతమతమవుతోన్నారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాడు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో తమ్మలు ఓటమి చెందినా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో నాలుగేళ్లు రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగడంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. పార్టీలో తాను పెంచి పోషించిన నేతలు తన ఓటమికి పనిచేయడంతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయాడు. అయితే ఓడిపోయిన నేతలను, ముఖ్యంగా సీనియర్లను రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారు. దీంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది.

అంతేకాకుండా  తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో టీఆర్ఎస్ లో   తుమ్మల రాజకీయ భవితవ్యం  గందరగోళంలో పడింది.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన రామదాసు ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన తుమ్మల సత్తా చాటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఓడిపోవడం.. అక్కడ గెలిచిన ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ దగ్గరుండి ఈ తంతు నిర్వహించారు.  మంత్రి కేటీఆర్ తో తుమ్మలకు గ్యాప్ పెరగడమే ఆయనకు పదవి రాకపోవడానికి కారణం అంటారు.తుమ్మల ఇప్పుడు ప్రగతి భవన్ లోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ టీఆర్ఎస్ లో యాక్టివ్ అవుదామని తుమ్మల భావిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి వైఎస్ షర్మిల పోటీకి రెడీ కావడం తుమ్మలకు మింగుడు పడడం లేదు. రెడ్డి సామాజికవర్గం ఓట్లు బాగా ఉండడంతో సీటు పోగొట్టుకోవడంపై తుమ్మల ఆందోళనగా ఉన్నారు.

ఇవన్నీ ఆలోచించాక.. టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది.   రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రాజకీయ అనుచరుల్లో.. ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే ఈ ప్రచారంపై తుమ్మల ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తుమ్మల బీజేపీలో చేరుతారా? టీఆర్ఎస్ లో కొనసాగుతారా? అన్నది వేచిచూడాలి. ఆయన నోరు తెరిస్తే గానీ ఈ ప్రచారంపై క్లారిటీ వచ్చేలా లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News