నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C48 ..!

Update: 2019-12-11 11:33 GMT
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. PSLV-C 48 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు అంతరిక్ష నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహకనౌకలో మన దేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఇందులో అమెరికా 6, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.. రీశాట్-2బీఆర్1 బరువు 628 కేజీలు. ఇక PSLV సిరీస్‌లో ఇస్రోకు ఇది 50వ ప్రయోగం. ఇప్పటికే పీఎస్ ఎల్వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావడంతో మంచి ఊపుమీదున్న ఇస్రో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

PSLV-C48 సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమైన 23 గంటల సాగి ..ఆ తరువాత నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ కౌంట్‌డౌన్ సాయంత్రం 4.25 నిమిషాలకు ప్రారంభించాల్సి ఉండగా, 4.30 వరకు రాహుకాలం ఉండటంలో 4.40 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 3.25 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.  ఈ రిశాట్-2బీఆర్1 ఉపగ్రహంతో దేశ భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ ఉపగ్రహం శత్రు కదలికలపై స్పష్టమైన సమాచారం చేరవేస్తుంది. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ శత్రువుల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనుంది.


Tags:    

Similar News