రూ.5లక్షల కోట్ల కంపెనీ సీఈవో పదవికి రిజైన్.. ఏం చేయనున్నారో తెలిస్తే షాక్

Update: 2022-06-30 02:59 GMT
నిజంగా నిజం. ఇప్పుడు మీరు చదివేది ఏ సినిమాలో సన్నివేశమో.. వెబ్ సిరీస్ లో సీన్ ఎంతమాత్రం కాదు. రీల్ సీన్ లా అనిపించే రియల్ సీన్ గా చెప్పాలి. పెద్ద వయస్కులైన తన తల్లిదండ్రుల్ని చూసుకోవటం కోసం.. తన లైఫ్ ను కాస్త భిన్నంగా.. ప్రశాంతంగా గడపాలని డిసైడ్ అయిన ప్రముఖ కంపెనీ సీఈవో.. తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడీ వార్త కార్పొరేట్ ప్రపంచంలో షాకింగ్ గా మారింది.

పలువురు ఈ నిర్ణయాన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకూ అలాంటి షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నది మరెవరో కాదు.. జూపిటర్ ఫండ్ మేనేజ్ మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ ఫార్మికా.

రూ.5లక్షల కోట్ల సంపద కలిగిన జూపిటర్ సంస్థ బాధ్యతల్ని 2019లో చేపట్టిన  ఆండ్రూ.. ఉన్నట్లుండి.. తన సీఈవో పదవికి రాజీనామా చేసిన వైనం విస్మయానికి కారణమైంది. అక్టోబరు ఒకటి నుంచి ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. అయితే.. ఆయన తన పదవికి రాజీనామా చేయటానికి పూర్తిగా వ్యక్తిగత కారణాలేనని చెబుతున్నారు.

జూపిటర్ నుంచి వైదొలుగుతున్న ఆయన మరే కంపెనీలో చేరటం లేదని.. పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లుగా బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ.. మూడు దశాబ్దాలుగా ఇంగ్లండ్ లోనే ఉంటున్నారు.

ఆయన తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. పెద్ద వయసుకు చేరిన ఆయన తల్లిదండ్రులకు.. తాను తోడుగా ఉండాలని ఆండ్రూ నిర్ణయించారని చెబుతున్నారు. శేష జీవితంలో తల్లిదండ్రులకు తోడుగా నిలవాలన్న ఆయన.. అందుకు వీలుగా అక్టోబరు 1న తన పదవీ బాధ్యతల్ని ముగించుకొని.. ఆస్ట్రేలియాకు వెళ్లిపోనున్నారు.

తల్లిదండ్రుల్ని చూసుకోవటం.. బీచ్ లో కాలక్షేపం చేయటం లాంటివి మాత్రమే ఆయన చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన బ్లూమ్ బర్గ్ కు చెప్పటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్వెస్ట్ మేనేజ్ మెంట్ పరిశ్రమలో 27 ఏళ్లు అపార అనుభవం ఉన్న ఆండ్రూ ఫార్మికా వివిధ సంస్థల్లో వివిధ స్థాయిల్లో పని చేశారు. చక్కటి సీఈవోగా గుర్తింపు ఉన్న ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది.
Tags:    

Similar News