మట్టి తట్ట మోసి.. పైసలిచ్చిన కేసీఆర్

Update: 2015-08-22 04:58 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాటల మనిషిగా చాలామంది అభివర్ణిస్తుంటారు. అయితే.. మిగిలిన వారి కంటే కేసీఆర్ లోని ప్రత్యేకత ఏమిటంటే.. మాటలే కాదు చేతల్లో కూడా ఆయన చాలా పనులు చేసి చూపిస్తుంటారు. మాటలు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయో చేతలు కూడా అదే తీరులో ఉండటం ఒక విశేషంగా చెప్పాలి.

తన ఫాంహౌస్ ఉన్న ఎర్రవల్లి గ్రామంలో గురువారం హటాత్తుగా పర్యటించి.. ఊరిని చూశాక ఏడ్వటం మొదలెడితే గంట ఏడ్చినా బాధ తీరదని చెప్పటమే కాదు.. ఊళ్లో జనాలు శుక్రవారం కదలివస్తే.. తాను కూడా వచ్చి ఊరిని బాగు చేసేద్దామని చెప్పటం తెలిసిందే.

చెప్పిన మాటకు తగ్గట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయమే.. షెడ్యూల్ ప్రకారం ఎర్రవల్లి గ్రామానికి వచ్చేశారు. ముఖ్యమంత్రి పిలుపు పుణ్యమా అని ఊరు మొత్తం కదిలి వచ్చింది. ప్రతి ఇంటి నుంచి తట్ట.. పార పట్టుకొని గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని.. పొద్దున నుంచి సాయంత్రం వరకూ శ్రమదానం పనుల్లో మునిగి తేలారు. వారితో పాటు.. అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం భాగస్వామ్యులయ్యారు.

ఉదయం మొదలు పెట్టిన పనులు.. సాయంత్రం అయ్యే వరకూ తాను దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గ్రామస్తులతోకలిసి సహపంక్తి భోజనమే కాదు.. వారిని ఉద్దేశించి.. తనదైన శైలిలో ప్రసంగించారు. తన చేతలతో అలరించిన ఆయన.. మాటలతో వారి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. మంచి పనికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని.. తన వెంట నడవాలని.. ధరిద్రం మీద యుద్ధం చేద్దామని.. తాను గ్రామస్థుల వెంట ఉంటానని.. ఎందుకు పైకి రారో చూద్దామంటూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

ఎర్రవల్లి గురించి తాను అన్న మాటల్ని మీడియా ద్వారా తెలుసుకొని గ్రామానికి వచ్చి.. అభివృద్ధిలో పాల్గొనటమే కాదు.. డబ్బులు ఇస్తామని కూడా కొందరు ముందుకు రావటాన్ని కేసీఆర్ అభినందించారు. ఎర్రవల్లిలో ఇళ్లు లేని వారంటూ ఎవరూ ఉండొద్దని.. ఇంతకాలం ముక్కిపోయి.. మురిగిపోయిన ఇళ్లల్లో కాలం గడిపామని.. ఇకపై అలా ఉండొద్దని.. ఐదారు నెలల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని వ్యాఖ్యానించారు.

‘‘ఈ దెబ్బకు ఊరంతా సైరకు రావాలె. దయ్యం వదలాలె. ఇప్పుడు మనం పని మొదలెట్టినం. ఎర్రవల్లి ఎంత అందంగా మారిందో అందరూ ఆశ్చర్యపోవాలి. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఇవాల్టి నుంచి ఊళ్లో మోటు మాటల్ని బంద్ చేయండి. అలా మాట్లాడితే రూ.50 జరిమానా విధించండి. అప్పుడు అందరూ సక్కగ మాట్లాడతరు. గ్రామ కమిటీలో ఈ నిర్ణయం తీసుకోండి. ఏమయ్యా ఎంపీగారు మా ఊరికి ఎన్ని డబ్బులిస్తరు?’’ అని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. రూ.50లక్షలు ఇస్తానని ప్రకటించారు. అక్కడే ఉన్న కలెక్టర్  రోనాల్డ్ రాస్ ను ఉద్దేశించి.. ‘‘కలెక్టర్ గారూ.. మీరెంత ఇస్తరు?’’ అని అడిగారు. అందుకు బదులుగా రూ.25లక్షలు ఇస్తమని చెప్పారు. దీనికి స్పందించిన సీఎం.. ‘‘ఇగ జూసిన్నా.. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా షాన డబ్బులు తెస్త’’ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీదా ఊరిని బాగు చేయాలని.. అందంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష ఒక్కటే కాదు.. అందుకు తగ్గట్లే స్వయంగా సీన్ లోకి వచ్చి.. అలానే దగ్గరుండి ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలబడి పని చేయించి.. నిధులు వచ్చేలా చేయటం సీఎం కేసీఆర్ కే సాధ్యమవుతుందేమో.
Tags:    

Similar News