ఒకేరోజు 14మందికి.. కరోనాలో నంబర్‌ వన్‌ కేరళ

Update: 2020-03-25 10:50 GMT
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించగా కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 600 దాటే పరిస్థితి కనిపిస్తోంది. అయితే దేశంలోనే అత్యధికంగా మాత్రం దక్షిణాది రాష్ట్రం కేరళలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మూడు వారాలపాటు కేంద్రం లాక్‌ డౌన్‌ ప్రకటించి ప్రజలందరూ ఇళ్లల్లో పరిమితమయ్యారు. ఈక్రమంలో ఇంటింటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సర్వే చేస్తున్నాయి. దేశ - విదేశాల నుంచి రాకపోకలు సాగించిన వారిని హోంక్వారంటైన్‌ విధించారు. దీంతో కరోనా కేసులు గుర్తించడానికి సులభమైంది. ఈ నేపథ్యంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు బహిర్గతమవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆ సర్వేలో గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేస్తుండడంతో వారికి పాజిటివ్‌ తేలుతోంది. అయితే కరోనా వైరస్‌ ఈశాన్య భారతాన్ని కూడా తాకింది. తాజాగా మిజోరం రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్‌ నమోదైంది. ఇక దక్షిణాది ప్రాంతంలో కీలకమైన కేరళలో దేశంలో కన్నా అత్యధికంగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ - మహారాష్ట్రతో పాటు తెలంగాణ కూడా కూడా కరోనా పాజిటివ్‌ కేసులతో పోటీ పడుతున్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్‌ కేసులు మహారాష్ట్ర - కేరళలోనే నమోదవుతుండగా ప్రస్తుతం కేరళలో ఆ సంఖ్య సెంచరీ దాటి 110కి చేరింది. ప్రస్తుతం కేరళలో వైరస్‌ బాధితుల సంఖ్య 110కి చేరుకుంది. మంగళవారం రాత్రి కొత్తగా మరో 14 మందికి వైరస్‌ నిర్ధారణ అవడంతో అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది. దీంతో కేరళలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.

కేసులు పెరుగుతుండడంతో కేరళలలో ఆంక్షలు తీవ్రం చేశారు. మార్చి 31 వరకు మద్యం ఉత్పత్తులను నిలిపివేయాలని ఆ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదేశించారు. నిత్యావసరాల ధరలు పెంచేవారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మొత్తం 110 కేసుల్లో నలుగురు ఈ వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు.

– ఇక ఇన్నాళ్లు అత్యధిక కేసులతో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుతం కేసుల సంఖ్య 101. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

– కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 41కి చేరింది.

– రాజస్థాన్‌లో తాజాగా నాలుగు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36కి చేరింది. అయితే ఆ రాష్ట్రంలో ఒక్క బిల్వారాలోనే 16 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా మృతుల సంఖ్య పది దాటింది. మహారాష్ట్రలో ఇద్దరు మరణించగా.. బిహార్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, పశ్చిమబెంగాల్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News