అమెరికాకు తెలిసి రావాల‌నే ఇలా చేశాను

Update: 2017-09-16 07:00 GMT
ప‌దేప‌దే అణు - మిస్సైల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డ‌మే త‌న టార్గెట్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అమెరికా సైన్యానికి దీటుగా త‌మ ద‌ళాలను బ‌లోపేతం చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా కిమ్ అన్నారు. ఈ విష‌యాన్ని ఆ దేశానికి చెందిన న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

రెండ‌వ సారి జ‌పాన్ మీదుగా నార్త్ కొరియా క్షిప‌ణిని ప‌రీక్షించి ఇటు జ‌పాన్‌ ను అటు అమెరికాను వ‌ణికించిన సంగ‌తి తెలిసిందే. సుమారు 3700 కిలోమీట‌ర్లు మిస్సైల్ ప్ర‌యాణించిన‌ట్లు స‌మాచారం.  హాసంగ్‌-12 మిస్సైల్ ప‌రీక్ష‌ను ఉత్తరకొరియా అధినేత కిమ్ స్వ‌యంగా తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా కిమ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆ దేశ మీడియా  వెల్ల‌డించింది. త‌మ‌పై ఐక్య‌రాజ్య‌స‌మితి ఎన్ని ఆంక్ష‌లు విధించినా తాము ఎలా న్యూక్లియ‌ర్ శ‌క్తిగా మారామ‌న్న విష‌యాన్ని ప్రపంచానికి చాటాల‌ని కిమ్ త‌న సందేశంలో పేర్కొన్నారు. అమెరికాకు దీటుగా సైనిక ద‌ళాల‌ను క్రియేట్ చేసి అగ్ర‌రాజ్యానికి చెక్ పెట్టాల‌ని కిమ్ పిలుపునిచ్చారు. సైనిక శక్తిలో అమెరికాతో సమఉజ్జీ అని నిరూపించేందుకే తాజాగా క్షిపణి ప్రయోగం చేపట్టాం అని  కిమ్‌ జొంగ్‌ ఉన్‌ అన్నారు. ఎన్ని ఆంక్షలు విధించిన ఉత్తరకొరియా అణుకార్యక్రమం ఆగదని పెద్దదేశాలకు చూపించామన్నారు. ఈ పరీక్షలతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా సైనికచర్య అనే మాట మాట్లాడేందుకు కూడా ధైర్యం చేయదని వివరించారు.

హాసంగ్‌-12 క్షిపణి పరీక్షను ఉత్తరకొరియా అధినేత ప్రత్యక్షంగా పరిశీలించిన సంద‌ర్భంగా దేశ అణుఅవసరాలను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కిమ్‌ ప్రతిజ్ఞ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. తాజా పరీక్షతో ఉత్తరకొరియా శక్తి మరింత పెరిగిందని కిమ్‌ వివరించారని తెలిపింది. సోవియట్‌ యూనియన్‌ కొన్ని దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన స్కడ్‌ క్షిపణి ఆధారంగా ఉత్తరకొరియా పరిశోధనలు ప్రారంభించింది. ఆ తర్వాత చాలాసార్లు, స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను పరీక్షించింది. దేశ ఉత్సవాల్లో పలుమార్లు ఉత్తరకొరియా ఆయుధ సంపదను ప్రదర్శించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News