బీఆర్‌ఎస్‌ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-03 03:28 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పై మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం ఏపీలో ఉండదన్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలకంగా ఏమీ ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ ను కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ గా మార్చారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ను విడగొట్టటంలో కానీ, ఆంధ్రప్రదేశ్‌ నష్టపోవడంలో కానీ కేసీఆర్‌ పాత్ర ఉందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. కాబట్టి ప్రజల మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుందనేది ముఖ్యమన్నారు. దేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తాను చెప్పలేనన్నారు. ఏపీలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ పెద్ద ప్రభావం చూపదని తాను నమ్ముతున్నానని వెల్లడించారు.

కేసీఆర్‌ ఒక పార్టీని పెట్టి అంచెలు అంచెలుగా రాష్ట్రాన్ని సాధించారన్నారు. వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారన్నారు. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదని, రాజకీయాలు తెలియవని తాము అనుకోవడం లేదన్నారు. జాతీయ రాజకీయాలపైన, దేశంలో ఉండాల్సిన విధానాలపైన ఆయనకు ఒక అవగాహన ఉందన్నారు. అందుకోసం ఆయన టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా రూపురేఖలు మార్చారన్నారు. జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేసి.. కేంద్రంలో అధికారంలోకి రావాలని కేసీఆర్‌ ఆశిస్తున్నారన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌ గా పోటీ చేస్తుందని కొడాలి నాని స్పష్టం చేశారు. తమకు రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. వైసీపీ ఏపీ రాజకీయాలు కోసం, ఏపీ బాగు కోసం, ఏపీ సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ అని కొడాలి నాని గుర్తు చేశారు. వైసీపీ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పార్టీ అని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో వైసీపీ పాత్ర అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. అప్పుడున్న పరిస్థితును బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి.. ఎప్పుడు మద్దతు ఇవ్వకూడదో వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్‌ తీసుకునే నిర్ణయాలకు వైసీపీ కట్టుబడి ఉంటుందన్నారు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటనే దానిపై తాను జాతకాలు చెప్పడానికి జ్యోతిష్కుడిని కానన్నారు.

కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. తాము ఎవరితోనూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించడంతో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ తో ఎలాంటి పొత్తు ఉండబోదని భావిస్తున్నారు. అలాగే ఏపీ నష్టపోవడానికి కారణం కేసీఆర్‌ అని ప్రజలు నమ్ముతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించడం ద్వారా కేసీఆర్‌ పార్టీకి ఏపీలో ఎలాంటి ఆశాజనకమైన ఫలితాలు ఉండవని తేల్చిచెప్పినట్టు అయ్యింది. మొత్తం మీద బీఆర్‌ఎస్‌ ను వైసీపీ నేతలు లైట్‌ తీసుకున్నట్టే కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News