కాపులు సీఎంలు కావాలని నాకెందుకు ఉంటుంది: కాపు మంత్రి సంచలన వ్యాఖ్యలు

Update: 2023-01-11 06:14 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రస్తుతం కాపుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అత్యధిక సామాజికవర్గంగా ఉన్న కాపుల నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ.. కర్ణాటకలో లింగాయత్‌ సామాజికవర్గాన్ని ఆకట్టుకుని అధికారంలోకి వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్‌ లో సైతం కాపు సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు నడుపుతోంది. కాపుల్లో ఉన్న రాజ్యాధికార కలను తాము నెరవేరుస్తామని.. జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్‌ కల్యాణ్‌ సీఎం అవుతారని చెబుతోంది.

మరోవైపు వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే 2014లో మాదిరిగా జనసేన-టీడీపీ-బీజేపీ కలసి కూటమిగా ఉండాలని పవన్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ భేటీ అయ్యారు. దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు.. ముఖ్యంగా కాపు మంత్రులు పవన్‌ కల్యాణ్‌ పై నిప్పులు చెరిగారు. కాపులను ప్యాకేజీ కోసం చంద్రబాబుకు గంపగుత్తగా పవన్‌ అమ్మేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్‌.. చంద్రబాబు దగ్గరకు వెళ్లారని తీవ్ర విమర్శలు చేశారు.

ఈ క్రమంలో జగన్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యవహారాన్ని చూసిన కాపులు .. ఆడిని ఎక్కడైనా చూపించండిరా అని వ్యాఖ్యానిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాపులు సీఎం కావాలని కాపులకు ఉంటుందేమో కానీ తనకెందుకు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపులు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నవారు కేరింతలు కొడుతూ పవన్‌ కల్యాణ్‌ దగ్గరకు Ðð ళ్తున్నారని కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సామాజికవర్గపరంగా పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు అభిమానముందన్నారు. అయితే తామందరం (కాపులు) బాధపడేలా పవన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేన-టీడీపీది అపవిత్ర పొత్తు అని వ్యాఖ్యానించారు. పవన్‌ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాపుల పరువు తీయొద్దని పవన్‌ కల్యాణ్‌ ను కోరుతున్నానని కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యహరిస్తున్న తీరు చూసి ఆయనను ఎక్కడైనా చూపించండిరా అంటూ ప్రజలు సినిమా డైలాగులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్‌ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం పవన్, చంద్రబాబు వల్ల కాదన్నారు. వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడుతూ వంగవీటి రాధా టీడీపీలో, దేవినేని అవినాష్‌ వైసీపీలో ఎందుకున్నారో వారినే అడగాలన్నారు. తెలంగాణలో తనకున్న వ్యాపారాలు, ఇబ్బందులు కారణంగానే తోట చంద్రశేఖర్‌ తెలంగాణ సీఎం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాపులు సీఎం కావాలని తనకెందుకు ఉంటుందని వ్యాఖ్యానించడంపై జనసేన శ్రేణులు ఆయనపై మండిపడుతున్నాయి. వైసీపీలో ఉన్న పాలికాపుల్లో జగన్‌ కు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News