టీఆర్ ఎస్‌ లో కొత్త పంచాయితీ... కేటీఆర్ తీర్పు ఇదే

Update: 2019-07-06 07:59 GMT
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్‌ కు పూర్తిస్థాయిలో మెజారిటీ కట్టబెట్టిన సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్‌ కు బలమైన గొంతు లేకుండా చేయాలని భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. కాంగ్రెస్‌ కు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో కూడా ఒకరిద్దరు ఎప్పుడైనా జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పాత... కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ట‌ర్మ్‌ లో మంత్రిగా ఉన్న ప‌ట్నం మ‌హేంద‌ర్‌ రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో తాండూరులో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఫైలెట్ రోహిత్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇటీవ‌ల ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక‌య్యారు. ఇక ఇటీవ‌ల రోహిత్‌ రెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో కారెక్కేశారు.

రోహిత్‌ రెడ్డి యంగ్ కావ‌డంతో ఆయ‌న కూడా కేటీఆర్‌ కు అత్యంత స‌న్నిహితంగా మారారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు కూడా మంచి ప‌ట్టు ఉంది. అటు మంత్రిగా ప‌నిచేసిన మ‌హేంద‌ర్‌ రెడ్డికి తాండూరు నియోజ‌క‌వ‌ర్గంతో ఏకంగా రెండున్న‌ర ద‌శాబ్దాల అనుబంధం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేసే ప‌రిస్థితి లేదు. ఈ ఇద్ద‌రు నియోజ‌క‌వ‌ర్గంపై ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది.

చివ‌ర‌కు తాండూరు పంచాయితీ ఇప్పుడు కేటీఆర్ వ‌ద్ద‌కు చేరింది. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో భాగంగా  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి-ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తాయి. పాత - కొత్త అంటూ క్యాడర్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ‌త కొద్ది రోజుల నుంచి న‌డుస్తోన్న ఈ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకోవ‌డంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరు వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం క‌లిసే ప‌రిస్థితి లేదు.


Tags:    

Similar News