మోడీని రౌండప్ చేసేద్దామంటున్నాడు

Update: 2017-06-12 05:38 GMT
విల‌క్ష‌ణ రాజ‌కీయ‌వేత్త అనే పేరున్న ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పిలుపు ఇచ్చారు.  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్‌బంధన్ (మ‌హాకూట‌మి)తో బీజేపీకి చెక్ పెట్టి అధికారంలోకి వచ్చిన లాలూ జాతీయ స్థాయిలో అదే ఫార్ములాను అమ‌ల్లో పెట్టాల‌ని డిసైడ‌య్యారు. త‌న జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా మరో మహాగట్‌ బంధన్‌ కు లాలూ పిలుపునిచ్చారు.

2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో లౌకిక పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని లాలూ పిలుపునిచ్చారు. ట్విట్టర్‌ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర - జాతీయ స్థాయి నేతలకు తనదైన శైలిలో ధన్యవాదములు తెలిపారు. బీహార్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ చౌదరి ట్వీట్‌ కు జవాబిస్తూ ''ధన్యవాదములు చౌదరీ గారు. ఇప్పుడు మహాకూటమి నాయకత్వం కోసం ఢిల్లీ ఎదురుచూస్తోంది'' అని ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిచోటా బీజేపీని అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని, ఆగస్టులో నిర్వహించే ర్యాలీలో బీజేపీయేతర పార్టీ నేతలు అందరూ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ మహాకూటమి ప్రభుత్వాన్ని చూస్తుందని లాలూ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

కాగా, లాలూ జ‌న్మ‌దినం సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ - రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు - విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరీ పాట్నాలోని లాలూ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.  కూటమి ఏర్పాటుకు పార్టీలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ - బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా లాలూకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News