బెదిరించిన జర్నలిస్టు.. ఒకింత ‘‘సాహా’’సమే చేశాడు..

Update: 2022-02-21 14:30 GMT
భారత్ లో ప్రస్తుతం వికెట్ కీపింగ్ పరంగా అత్యున్నత నైపుణ్యాలు ఉన్నదెవరికంటే.. క్రికెట్ పండితులు ఠక్కున చెప్పే పేరు  వృద్ధిమాన్‌ సాహా. చాలా కాలంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని ఉన్నప్పటి నుంచీ సాహానే నంబర్ వన్ వికెట్ కీపర్ గా చెబుతున్నారు. అయితే, అతడి బ్యాడ్ లక్ ఏమిటంటే.. ధోని కాలంలో కీపర్ గా ఉండడం. దినేశ్ కార్తీక్ తరహాలోనే సాహా కూడా ధోని హవాలో తెరగమరుగయ్యాడు. లేదంటే వెలుగులోకి రాలేకపోయాడు. ధోని ఏదైనా సిరీస్ కు దూరంగా ఉంటేనో.. సాహాకు అవకాశం దక్కేది. కీపింగ్ పరంగా అత్యున్నత నైపుణ్యం ఉన్నప్పటికీ అతడిని బ్యాడ్ లక్ అలా వెంటాడింది. అయితే, కొన్నిసార్లు అవకాశం వచ్చినా సాహా బ్యాట్స్ మన్ గా జట్టుకు అంతగా ఉపయోగపడలేదు.

తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన సాహా.. రంజీ మ్యాచ్ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టాడు. 2007లో హైదరాబాద్ పై జరిగిన మ్యాచ్ లో సాహా సెంచరీతో ప్రారంభంలోనే ఆకట్టుకున్నాడు. ఇదే మ్యాచ్ లో ఆడిన లక్ష్మీ రతన్ శుక్లా, మనోజ్ తివారీ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. ఇక దీప్ దాస్ గుప్తా ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) కు వెళ్లిపోవడంతో సాహాకు బెంగాల్ రంజీ జట్టులో అవకాశం దక్కింది. దానిని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2009-10 సీజన్ లో సాహా కు టీమిండియా అవకాశం దక్కింది. అది కూడా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో అనూహ్యంగా బ్యాట్స్ మన్ గా సాహాను తుదిజట్టులోకి తీసుకున్నారు. కాగా, కీపర్ గా నైపుణ్యానికి వంక పెట్టలేకున్నా.. సాహా కెరీర్ తొలి ఐదేళ్లు ధోనీ నీడలోనే సాగింది. 2014లో ధోని రిటైరయ్యాక సాహా జట్టు రెగ్యులర్ సభ్యుడయ్యాడు. తర్వాత మూడునాలుగేళ్లు టీమిండియా తరఫున ఆడినా రిషభ్ పంత్ రాకతో సాహా స్థానం ప్రశ్నార్థకమైంది. దీనికితోడు వరుసగా గాయపడడం అతడిని జట్టుకు దూరం చేసింది. 2018 ఇంగ్లండ్ టూర్ కు అతడు చివరి నిమిషంలో ఇలానే దూరమవగా.. తన స్థానంలో వచ్చిన పంత్ పాతుకుపోయాడు.

జట్టులో చోటు కష్టమని ముందే చెప్పేశారా?

ప్రస్తుతం సాహా వయసు 37 ఏళ్లు. కెరీర్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే, ఇప్పటికీ ఫిట్ గా ఉన్నందున పోటీ క్రికెట్ ఆడగలడు. అయితే, పరిస్థితులు మారడం సాహాకు ప్రతికూలమైంది. పంత్ కు తోడు ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లు దుమ్మురేపుతుండడం మరింత పోటీకి దారితీసింది. ఆంధ్ర ప్రదేశ్ యువ కీపర్ కోనా శ్రీకర్ భరత్ ను టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్ గా భావిస్తుండడం, అతడు రంజీల్లో అదరగొడుతుండడంతో సాహాకు టీమిండియా దారులు దాదాపు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు సాహా ఎంపిక ప్రశ్నార్థకమైంది. ఎవరూ ఊహించని విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. సాహా ను రిటైర్ అవమనిచెప్పాడంటూ వార్తలు వచ్చాయి. ఓ హెడ్ కోచ్ ఇలా చెప్పడమంటే దాదాపు ఆటగాడి కెరీర్ ముగిసినట్లే.

అయితే, ద్రవిడ్ వంటి వ్యక్తి ఇలా చెప్పి ఉండకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. టెస్టు సిరీస్‌కు ముందు శనివారం భారత జట్టును ఎంపిక చేయగా అందులో అతడితో పాటు పలువురు సీనియర్‌ ఆటగాళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన సాహా.. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ద్రవిడ్‌ తనను రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని సూచించినట్లు పేర్కొన్నాడు.

సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారగా ద్రవిడ్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. ‘ఇప్పటికే టీమ్‌ఇండియాలో రిషభ్‌ పంత్‌ నంబర్‌ 1 వికెట్‌ కీపర్‌గా నిరూపించుకున్నాడనే విషయాన్ని సాహాతో చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే జట్టు యాజమాన్యం కూడా రెండో వికెట్‌ కీపర్‌గా యువకులకు (కేఎస్‌ భరత్‌) ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన చేసినట్లు వివరించాను. అంతమాత్రాన సాహా అంటే నాకు చిన్నచూపు కాదు. అతడి పట్ల గౌరవం లేదని కాదు. అయితే, ఇలాంటి విషయాల పట్ల ఆటగాళ్లతో మాట్లాడకుండా మౌనంగా ఉండటమే నాకు తేలికైన విషయం. కానీ, నేను అలాంటి వ్యక్తిని కాదు. కొంతకాలం తర్వాతైనా వారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని టీమ్‌ఇండియా కోచ్‌ వివరించాడు. మరోవైపు తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం టీమిండియాలో నీ స్థానానికి ఢోకా లేదని సౌరభ్ గంగూలీ చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నారని అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో సాహా వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

అసలు భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయం సద్దుమణిగింది అనుకుంటుండగా.. వాటన్నిటినీ మించి ప్రస్తుతం సాహాను ఓ జర్నలిస్టు బెదిరించారనే వార్తలు వస్తున్నాయి.

ట్వీట్‌.. వాట్సాప్‌ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..

ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం సహా... ఓ జర్నలిస్టు తనను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పంపాడంటూ సాహా ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత.. సోకాల్డ్‌ ఓ జర్నలిస్టు నా పట్ల ప్రదర్శించిన ‘గౌరవం’ఇది! జర్నలిజం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ సదరు వ్యక్తి తనకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు సాహా షేర్‌ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సహా... వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ అతడికి అండగా నిలిచాడు. క్రికెటర్‌ పట్ల జర్నలిస్టు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని, అతడి పేరు బయటపెట్టాల్సిందిగా వృద్ధికి సూచించారు. ఇక ఈ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జోక్యం చేసుకోవాలని రవిశాస్త్రి విజ్ఞప్తి చేశాడు. ఈ పరిణామాల క్రమంలో సాహా వివాదంపై దృష్టి సారించిన బీసీసీఐ... ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సాహాకు మెసేజ్‌లు చేసిన వ్యక్తి ఎవరు? ఇంటర్వ్యూలో అతడు ఏం మాట్లాడాడు? తదితర విషయాల గురించి లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘‘బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ సాహా. అతడి పట్ల ఎవరైనా అవమానకరంగా వ్యవహరిస్తే బోర్డు చూస్తూ ఊరుకోదు. బెదిరింపులకు పాల్పడితే అస్సలు సహించదు. కచ్చితంగా విచారణ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రీడా విశ్లేషకులు..... ‘‘గంగూలీకి సాహాతో మాట్లాడి హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సాహా కూడా ఇలా మాట్లాడం సరికాదు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదు’’ అని అంటున్నారు.

ఆ స్క్రీన్‌షాట్‌లో ఏముందంటే!

‘‘నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. బాగుంటుంది. మీరు సరిగా స్పందించకపోతే.. నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించను. ఎవరు అత్యుత్తమ వికెట్‌ కీపరో... వాళ్లు అతడినే ఎంపిక చేస్తారు కదా. నువ్వు నాకు కాల్‌ చేయలేదు. నిన్నెపుడూ ఇక ఇంటర్వ్యూ చేయను. ఈ అవమానాన్ని నేను అంత తేలికగా మర్చిపోను. కచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. నువ్విలా చేయకుండా ఉండాల్సింది’’అంటూ సదరుజర్నలిస్టు తనకు వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడంటూ సాహా స్క్రీన్‌షాట్లు షేర్‌ చేశాడు.
Tags:    

Similar News