లోకేష్... పవన్ యాత్రలకు బ్రేకేసే మాస్టర్ పీస్ ఐడియా జగన్ దే...?

Update: 2022-11-26 09:39 GMT
ఏపీలో యాత్రల సీజన్ స్టార్ట్ అవుతోంది. ఇది ఆధ్యాత్మిక యాత్ర అనుకుంటే పొరపాటు. రాజకీయ యాత్రలకు రంగం సిద్ధం అవుతోంది. అధికారాన్ని అందుకోవడానికి తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ ఒక వైపు పాదయాత్ర అంటూ పాదం కదిలించే పనిలో ఉన్నారు. ఇక రైట్ రైట్ అంటూ బస్సెక్కి మరీ ఏపీ అంతా కలియతిరిగేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు.

ఈ ఇద్దరూ కొత్త ఏడాది 2023లోనే తమ యాత్రలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. లోకేష్ అయితే డేట్ టైం ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశారు. 2023 జనవరి 27న తన తండ్రి పర్మనెంట్ నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్రను లోకేష్ బాబు స్టార్ట్ చేయబోతున్నారు. నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటలు అంటూ ఈ యాత్ర సాగనుంది.

ఇక జనసేనాని బస్సు యాత్ర కూడా ఫిబ్రవరి తరువాత మొదలవుతుంది అని ప్రచారం సాగుతోంది. దానికి తిరుపతిని ప్లేస్ గా డిసైడ్ చేశారు. ఈ బస్సు యాత్ర ఓపెనింగ్ షాట్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తారని మొత్తానికి పవన్ బస్సు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు క్రియేట్ చేసేలా డిజైన్ చేశారు.

సరే ఈ రెండు యాత్రలు కనుక జనంలోకి వెళ్తే ఆ పొలిటికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రత్యేకించి రాజకీయాల్లో పండిపోయిన జగన్ కి తెలియదు అనుకుంటే తప్పే అవుతుంది. ఆయన స్వయంగా పాదయాత్రికుడు. ఆ ఫలాలను ఆయన పూర్తిగా అందుకున్న రాజకీయ ఆసామి. మరి తనకు దక్కిన ఆ భాగ్యం మరొకరు తన్నుకుపోతూ ఉంటే జగన్ చూస్తూ ఊరుకుంటారా.

తనదైన మాస్టర్ ప్లాన్స్ లో ఆయన ఉండకుండా ఉంటారా. అందుకే ఒకరు కాలికి బలపం కడుతున్న వేళ మరొకరు బస్సెక్కి హారన్ సౌండ్ చేసే టైం లో సడెన్ బ్రేకులు వేసే మంత్రం జగన్ దగ్గర ఉంటుంది అని అంటున్నారు. ఆయన వీరిద్దరినీ జనంలోకి పూర్తిగా వెళ్ళనీయకుండా మధ్యలోనే అడ్డుకునేందుకు ఉపయోగించే ఆయుధమే ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు.

ఏపీలో ముందసతు ఎన్నికలు అంటూ తొలి ఏడాది నుంచి వినిపిస్తున్న మాట. కానీ ఈసారి మాత్రం అది నూరు శాతం నిజం అవుతుంది అని అంటున్నారు. ఎలా అంటే ఏపీలో అన్ని రకాలుగా అప్పులు చేసి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. సంక్షేమ పధకాలను కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఇపుడు పరిస్థితి చూస్తే ఎక్కడా అప్పు పుట్టని వాతావరణం. దాంతో ఎన్నికల ఏడాదిగా ఉండే 2024లో సంక్షేమానికి చెల్లు చీటి రాయాల్సి వస్తుంది.

అదే జరిగితే జనాల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. అందుకే జనాలకు అన్నీ ఇచ్చామని  చెప్పుకుంటూ ఆ మంచి వారి నోట్లో ఉండగానే ఎన్నికల నగారా మోగించడానికి వైసీపీ రెడీ అవుతోంది అని అంటున్నారు. వైసీపీలో ప్రస్తుతం కనిపిస్తున్న దూకుడు కానీ ఎమ్మెల్యేలను గడప గడపకు పంపుతున్న తీరు కానీ పార్టీలో ప్రెసిడెంట్లను మార్చడం కానీ బీసీ నేతలలో మీటింగ్స్ కానీ ఇలా ఏది చూసుకున్నా ఎన్నికలు వచ్చే ఏడాది కచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మాట ప్రకారం చూస్తే వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను వెళ్తారని అంటున్నారు. అంటే మార్చిలో బడ్జెట్ సెషన్ కంప్లీట్ కాగానే అసెంబ్లీ రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది అని చెబుతున్నారు. అది జరిగితే మాత్రం ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఎన్నికలు మే నెలలో ఉంటాయని అంటున్నారు. మరి ఆ తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారానికే అటు పవన్ కానీ ఇటు లోకేష్ కానీ తమ యాత్రలను ఏ విధంగానూ సాగించలేరు. వారు కూడా అందరితో పాటే ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిందే.

ఈ విధంగా తనదే జనంలో అప్పర్ హ్యాండ్ ఉండేలా అదే సమయంలో విపక్షాలు జనంలోకి వెళ్లకుండా చూసేలా ఇక తాను అన్ని హామీలు నెరవేర్చాను అని చెప్పుకునేలా అన్నింటికీ ఒక్కటే మందు అన్నట్లుగా ముందస్తు ఎన్నికలకు జగన్ రెడీ అవుతున్నారు అని అంటున్నారు. అదే జరిగితే ముందస్తు ఎన్నికల వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు విజేతలు అవుతారు అన్నది రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే. మరి లోకేష్ జగన్ రికార్డులను బద్ధలు కొట్టాలనుకునే పాదయాత్ర ఏమవుతుంది, పవన్ బస్సు యాత్ర సంగతి ఏంటి అన్నది కూడా చూడాలంటే కాస్తా వెయిట్ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News