రెండేళ్ల క్రితం ప్రేమపెళ్లి.. 11 మందితో మర్డర్ చేయించిన మామ

Update: 2022-04-18 04:00 GMT
వారిద్దరి కులాలు వేర్వేరు. కానీ.. ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదరించి మరీ పెళ్లాడారు. వారి వైవాహిక జీవితానికి రెండేళ్ల వయసు వచ్చింది. కానీ.. తన మాట కాదని.. తన కులం కాని అల్లుడ్ని ఏదోలా అంతమొందించాలన్న కసితో రగిలిపోయిన అమ్మాయి తండ్రి.. అనుకున్నట్లే సుపారి ఇచ్చి చంపేయించిన దారుణానికి వేదికైంది భువనగిరి. డిజిటల్ యుగంలో కులాల అంతరాల్ని చెరిపేస్తూ.. పిల్లల ప్రేమ కోసం పెద్దలు తగ్గుతున్న ఈ రోజుల్లో అందుకు భిన్నంగా.. ఇప్పటికి మనసులేని తల్లిదండ్రులు ఉన్నారన్న ఉదంతానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఉదంతం.

తన కూతుర్ని పెళ్లాడినోడ్ని పదకొండు మందితో ప్లాన్ చేసి చంపేయించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మాత్రమే కాదు.. పెను సంచలనానికి కారణమైంది. అసలేమైందంటే..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లికి చెందిన రామక్రిష్ణ పదేళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరారు. మొదట్లో వలిగొండలో పని చేసి.. తర్వాత యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఇదిలా ఉంటే.. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన వెంకటేశ్ వీఆర్వోగా పని చేస్తున్నారు. వారి ఇంటి పక్కనే రామక్రిష్ణ ఉండేవాడు. వెంకటేశ్ కుమార్తె భార్గవి.

వారిద్దరి పరిచయం ప్రేమగా మారటం.. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. అయితే.. ఇద్దరి కులాలు వేర్వేరు కావటంతో వీరి పెళ్లికి భార్గవి తండ్రి వెంకటేశ్ వ్యతిరేకించారు. అయినప్పటికి రెండేళ్ల క్రితం భార్గవిని పెళ్లాడిన రామక్రిష్ణ.. పది నెలల క్రితం భువనగిరికి మకాం మార్చారు. వారికో కుమార్తె పుట్టింది.

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అల్లుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్.. అతడ్ని చంపేందుకు పెళ్లైన కొత్తల్లోనే ప్లాన్ చేశాడు కానీ వర్కువుట్ కాలేదు. ఎప్పుడైతే.. తన ఆస్తిలో వాటా కోసం కేసు వేస్తానని కుమార్తె అంటుందో.. అప్పటి నుంచి అతడి ఆగ్రహం మరింత ఎక్కువైంది. పెళ్లైన తర్వాత కూడా కుమార్తెను తిరిగి వచ్చేయాలని వెంకటేశ్ అడిగేవాడు. అందుకు తగ్గట్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇదిలా ఉంటే.. శుక్రవారం అమ్రతయ్యతో కలిసి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని భార్గవి ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అమ్రతయ్యను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో పోలీసు మార్కు చూపించటంతో నిజాలు తన్నుకుంటూ వచ్చేశాయి. రామక్రిష్ణను చంపేయటానికి రూ.10 లక్షల సుపారి ఇచ్చిన మామ వెంకటేశ్ ప్లాన్ కు తగ్గట్లే హతమార్చిన వైనాన్ని వెల్లడించటంతోపాటు.. అతడి డెడ్ బాడీని ఎక్కడ దాచింది బయటపెట్టేశారు. కల్లుగీత కత్తి.. సుత్తితో దారుణంగా హత్య చేసిన వైనాన్ని వివరించటంతో పాటు.. ఈ మొత్తం మర్డర్ ప్లాన్ లో పదకొండు మంది పాల్గొన్నట్లుగా వివరాలువెల్లడించారు. ఇప్పటికి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ఏడుగురి కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి ఇంత ఘాతుకానికి పాల్పడతాడని అసలే మాత్రం ఊహించలేదంటూ భార్గవి పెడుతున్న శోకాలు అందరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సుపారి హత్య ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News