గోలీ మార్ అన్నోడు మంత్రి అయ్యాడంటూ సుప్రీం మాజీ జడ్జి సంచలనం

Update: 2022-02-21 03:41 GMT
అత్యున్నత పదవుల్ని చేపట్టిన వారిలో చాలామంది.. రిటైర్ అయ్యాక.. మిగిలిన విషయాలకు దూరంగా ఉండిపోతుంటారు. అందుకు భిన్నంగా కొంతమంది మాత్రం నిజాల్ని నిర్మోహమాటంగా చెప్పేందుకు అస్సలు వెనుకాడరు.

 తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి..వార్తల్లో వ్యక్తిగా మారారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ లోకూర్. తాజాగా ఆయన కొన్ని కీలక అంశాలపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తీరును సూటిగా ప్రశ్నించటమే కాదు.. కడిగినంత పని చేశారు కూడా.

తన మనసులోని అభిప్రాయాల్ని షేర్ చేసేందుకు ఏ మాత్రం సంకోచించని ఆయన..ఇటీవల పెరిగిన ద్వేషపూరిత ప్రసంగాలపై ఆయన స్పందించారు. ధర్మ సంసద్.. ముస్లిం మహిళల్ని వేలం వేసేందుకు తయారు చేసిన దుర్మార్గమైన సుల్లీ డీల్స్.. బుల్లీ బాయ్ యాప్స్ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే?

-   ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

-  ధర్మసంసద్ నుంచి జాతి ప్రక్షాళన లేదంటే మారణహోమానికి పిలుపు వచ్చినట్లే.

-  విద్వేషపూరిత ప్రసంగాలు మారణహోమానికి దారి తీస్తాయని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

-  మూక హత్యలకు పాల్పడిన వ్యక్తులకు ఓ మంత్రి పూలమాలలు వేశారు.

-  లించింగ్ కూడా హింసే. ద్వేష ప్రసంగాలు హింసకు దారితీస్తాయి. ఢిల్లీలో కేబినెట్ మంత్రి కాని ఒక మంత్రి గోలీ మారో అని చెప్పి.. కేబినెట్ మంత్రి అయ్యారు.

- ఇలా అనటం చంపడానికి ప్రేరపించటం కాక మరేంటి?

-  ధర్మ సంసద్ విషయం సుప్రీంకోర్టుకు వచ్చినంత వరకు ఎలాంటి చర్యలు లేవు. ఆ తర్వాత మాత్రం కొన్ని అరెస్టు జరిగాయి.

- అరెస్టు అయిన వారు తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యారు.

-  మూక హత్యలకు పాల్పడిన వారికి ప్రభుత్వంలోని కొందరు పూలదండలు వేస్తున్నారు. దీంతో విద్వేష ప్రసంగాలు సరైనవేనన్న అభిప్రాయం ప్రభుత్వానికి ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

- వాక్ స్వాతంత్య్రానికి సహేతుకమైన పరిమితి ఉండాలి.
Tags:    

Similar News