బల నిరూపణకు ముందే చెతులెత్తేసిన బీజేపీ!

Update: 2019-11-26 09:50 GMT
అనుకున్నదంతా అయ్యింది.. కర్ణాటక, గోవా, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బలం లేకున్నా ప్రతిపక్షాలను చీల్చి గద్దెనెక్కిన బీజేపీ మహారాష్ట్రలోనూ అదే రీతిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఐక్యత ముందు తలవంచింది.

మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. రేపు బలనిరూపణ చేసుకోవాలని మహారాష్ట్ర లో కొలువుదీరిన బీజేపీ ఫడ్నవీస్ సర్కారుకు సుప్రీం కోర్టు అల్టీమేటం జారీ చేసింది. ఈ కీలక తరుణంలో కసరత్తు చేస్తున్న బీజేపీ కి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించి బీజేపీ కి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎం పోస్టు కొట్టిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తాజాగా తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం బీజేపీ బలనిరూపణకు సిద్ధమవుతున్న వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం బీజేపీ ని కోలుకోనీయకుండా చేసింది.

ఎన్సీపీ నుంచి ఫిరాయించిన అజిత్ పవార్ బీజేపీ కి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. అయితే డిప్యూటీ సీఎం పదవి కొట్టేశారు. అయితే అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యేలను దిగ్విజయంగా వెనక్కి రప్పించడం లో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ విజయం సాధించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అజిత్ పవార్ కూడా రాజీనామా చేసి తన మద్దతు శరద్ పవార్ కేనని ఈ మధ్యాహ్నం చెప్పి బీజేపీ నుంచి నిష్ర్కమించారు.

ఈ పరిణామం తో బీజేపీ పరువు పోయినట్టైంది. కీలకమైన రాష్ట్రాల్లో ప్రలోభ పెట్టి, భయపెట్టి, ఈడీ, ఐటీ కేసులను బూచీగా చూపి అధికారం కొల్లగొట్టిన బీజేపీ పప్పులు మహారాష్ట్రలో ఉడకలేదు. ధీరత్వానికి, పౌరుషానికి నెలవైన మహారాష్ట్రవాసులు బీజేపీ లోపాయికారి ఆశలకు వెరవలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేల వలసలు బీజేపీలోకి కొనసాగలేదు.

దీంతో అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఆయన బాటలో ఫడ్నవీస్ ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బీజేపీకి ఘోర అవమానంగా చెప్పవచ్చు. కేంద్రంలో అధికారంతో అడ్డదారుల్లో గద్దెనెక్కుదామనుకున్న బీజేపీ... మహారాష్ట్ర లో కనుక వైదొలిగితే దేశ వ్యాప్తంగా అభాసుపాలు కావడం ఖాయం. మరి ఏం జరుగుతుందనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.

Tags:    

Similar News