బీజేపీకి పెద్దపీట.. శివసేన చీలిక.. చక్రం తిప్పేస్తున్న షిండే

Update: 2022-07-07 15:16 GMT
మహారాష్ట్ర కొత్త సీఎం 'ఏక్ నాథ్ షిండే' తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తను చీల్చిన శివసేనను చీల్చిచెండాడుతున్నాడు. సొంత పార్టీనే దెబ్బతీస్తున్నారు. ఆ పార్టీలో అసమ్మతి రాజేసి.. ఎమ్మెల్యేలను పోగేసి బీజేపీ మద్దతుతో సీఎం అయిన షిండే.. ఇప్పుడు శివసేనలోని మొత్తం నేతలను లాగేస్తూ ఆ పార్టీనే లేకుండా చేసే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 45 మంది మంత్రులతోనూ నూతన కేబినెట్ ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

షిండే తనకు మద్దతు ఇచ్చి సీఎంను చేసిన బీజేపీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన వారు 25 మంది, షిండే నేతృత్వంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇక స్వతంత్రులకు సైతం కేబినెట్ లో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. ఏక్ నాథ్ షిండే, బీజేపీ మధ్య అవగాహన మేరకు శివసేనలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒకరు.. బీజేపీలో ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇక షిండేతోపాటు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తంగా కాగల కార్యం షిండేనే తీర్చినట్టు ఇటు శివసేన నాశనంతోపాటు మహారాష్ట్రలో బీజేపీకి పగ్గాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

-ఉద్దవ్ కు షాక్.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు

ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఇప్పుడు షిండే మరో షాక్ ఇచ్చాడు. శివసేనకు ఉన్న 18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలోనే షిండే నేతృత్వంలోని వర్గంలో  చేరడానికి రెడీ అయ్యారని సమాచారం. ఇక థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు. సీఎం షిండేను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఉన్న 67 మంది కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్దవ్ ఠాక్రే అధికారం కోల్పోయారు.
Tags:    

Similar News