లేఆఫ్ కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఇంటికే?

Update: 2023-01-18 11:30 GMT
కరోనా సమయంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఉద్యోగులను కాపాడుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే ఆర్థిక మాంద్యం.. పెరుగుతున్న ఖర్చులు.. రాబడి తగ్గిపోవడం వంటి కారణాలతో ఆ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా లేఆఫ్ కు సిద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.

తాజాగా టెక్ దిగ్గజ సంస్థ అయిన మైక్రో సాఫ్ట్ సైతం అదే దారిలో వెళుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలోనే ఈ వారంలో సుమారు 11 వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కంపెనీలో యూకేలో 6వేల మంది.. ప్రపంచవ్యాప్తంగా 2.20లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

అయితే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో నుంచి సుమారు ఐదు శాతం మేర కోత విధించాలని కంపెనీ భావిస్తోంది. అంటే ఈ శాతం సుమారు 11 వేల మంది ఉద్యోగులతో సమానంగా ఉండనుంది. వచ్చే వారం త్రైమాసిక ఆదాయానికి ముందే తొలగింపు ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సీఎన్బీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెక్ భవిష్యత్ రాబోయే రెండేళ్లు అత్యంత సవాళ్లతో కూడుకున్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మైక్రోసాప్ట్ లో సైతం ఉద్యోగుల తొలగింపు ఖాయమనే ముందస్తు సంకేతాలను ఉద్యోగులకు పంపించినట్లయింది.

కాగా ఇటీవలి కాలంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 18 వేల ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడరైన సేల్స్‌ఫోర్స్ 7వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమైంది. 2023 సంవత్సరంలో సగటున రోజుకు 1600 మంది ఉద్యోగులను తొలగించాయి.

2023 సంవత్సరం ప్రారంభం నుంచే టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. జనవరి తొలి 15 రోజుల్లోనే 91 కంపెనీలు సుమారు 24 వేల కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని స్కై న్యూస్ తన నివేదికలో పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News