వైరలవుతున్న మంత్రి రోజా ఆడియో!

Update: 2022-10-17 13:38 GMT
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజాకు మంత్రి అయిన ఆనందం కూడా మిగలడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. గత రెండు పర్యాయాలు అతి తక్కువ మెజారిటీతోనే రోజా నగరి నుంచి గెలుపొందారు.

వైఎస్‌ జగన్‌ రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు రోజా మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రోజాకు నగరి నియోజకవర్గంలో కీలక నేతలతో విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ శాంతి, ఆమె భర్త నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కేజే కుమార్, శ్రీశైలం దేవస్థానం బోర్డు ౖచెర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తదితరులతో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.

కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణిరెడ్డి తదితరులు రోజా మద్దతు లేకుండానే ఈడిగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు ఈ అసమ్మతి రాజకీయాలపై పార్టీ అధిష్టానానికి రోజా ఫిర్యాదు చేశారు. అయితే అసమ్మతి నేతలకు కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉండటంతో వైసీపీ అధిష్టానం వారిపై చర్యలకు వెనుకాడుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు మరోమారు అసమ్మతి సెగ ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన ఆమెకు తెలియకుండానే నగరి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం విశేషం. నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమిపూజ జరిగింది. దీనిపై రోజా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 
తనకు ఆహ్వానం లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా  నియోజకవర్గ పరిధిలోని కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ జరగడం పట్ల రోజా ఆ ఆడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా.. ప్రత్యర్థుల దృష్టిలో పార్టీనీ, తననూ చులకన చేసే విధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల పార్టీ సీరియస్‌ గా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీశైలం బోర్డు చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ శాంతి హాజరవడం గమనార్హం.  

తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొందరు తన వ్యతిరేకులు పార్టీ ముసుగులో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిండం మంత్రిగా ఉన్న తనను  బలహీనపరిచే కుట్రేనని రోజా నిప్పులు చెరిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే  రాజకీయాలు చేయడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒక ఆడియో విడుదల చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విపక్షాలైన తెలుగుదేశం, జనసేనలకు పార్టీ చులకన అవుతుందని అభిప్రాయపడ్డారు.

పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల దృష్టి సారించి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి వారికి ప్రోత్సాహం లభించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News