నోరు జారిన గులాబీ అభ్య‌ర్థి సారీ చెప్పాడు

Update: 2018-10-28 08:21 GMT
అధికార పార్టీ అన్నంత‌నే ఎంతోకొంత ఉత్సాహం ఉంటుంది. అందులోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు ఆ జోరు మ‌రింత ఎక్కువ‌. అధినేత కేసీఆర్‌.. ఆయ‌న కుమారుడు కేటీఆర్‌.. కుమార్తె క‌విత‌.. మేన‌ల్లుడు హ‌రీశ్ ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ ఆర్డ‌ర్ లో ఉన్న నేత‌లంతా ఫైర్ బ్రాండ్లు కావ‌టంతో వారి నుంచి స్ఫూర్తి పొందే వారు.. తాము కూడా అదే రీతిలో చెల‌రేగిపోవాల‌నుకుంటారు.

కాకుంటే.. టీఆర్ ఎస్ టాప్ ఆర్డ‌ర్ లో ఉన్న వారంతా ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడ‌తారు. నోరు జారి ఒక్క మాట అన‌ని ప్రావీణ్యం వారి సొంతం. గులాబీ అధినేతల మాదిరి టాలెంట్ లేకుండా.. వారు ప్ర‌ద‌ర్శించే ఆవేశాన్ని .. పిట్ట‌క‌థ‌ల‌తో అల‌రించాల‌ని ప్ర‌య‌త్నించే వారు అప్పుడ‌ప్ప‌డు అడ్డంగా బుక్ అవుతుంటారు.

తాజాగా అలానే బుక్ అయ్యారు కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గ తాజా మాజీ ఎమ్మెల్యే.. హ‌న్మంత్ షిండే. ప్ర‌స్తుతం గులాబీ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ఆయ‌న‌.. మూడు రోజుల క్రితం పిట్లం మండ‌లంలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. మాంచి జోరులో ఉన్న ఆయ‌న.. త‌న ప్ర‌సంగంలో ఏదో చెప్ప‌బోయి మ‌రేదో చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు. ఒక పిట్ట‌క‌థ చెబుతూ ర‌జ‌క మ‌హిళ‌ల మ‌నోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్య‌లు చేశారు. దీంతో.. ఆయ‌న మాట‌ల వీడియో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియో చూసినోళ్లంతా తిట్టి పోస్తున్న ప‌రిస్థితి.

ఇక‌.. ర‌జ‌కులైతే తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మా మ‌హిళ‌ల్ని ఇంత మాట అంటావా? అంటూ ఫైర్ అవుతున్నారు. ప‌రిస్థితిని గుర్తించిన షిండే వెన‌క్కి త‌గ్గారు. త‌న‌కు ర‌జ‌క మ‌హిళ‌ల్ని అవ‌మానించ‌టం త‌న ఉద్దేశం ఎంత మాత్రం కాద‌ని.. తాను చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా మ‌న‌సులు గాయ‌ప‌డితే త‌న‌ను నిండు మ‌న‌సుతో క్ష‌మించాల‌ని వేడుకున్నారు. ఇక‌పై ఏ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌నంటూ మాట ఇచ్చారు. సారీ అంటూ కిందా మీదా ప‌డే బ‌దులు.. కాస్త ఆలోచించి మాట్లాడితే ఈ ర‌చ్చ అంతా ఉండేది కాదు క‌దా షిండేజీ. 
Tags:    

Similar News