డ్రైవర్‌ హత్య వెనుక ఉన్న 'అనంత' మాయ ఇదేనా?

Update: 2022-05-21 09:43 GMT
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు అందరి వేళ్లూ అనంత ఉదయ్‌ భాస్కర్‌ వైపే చూపిస్తున్నాయి. గొల్లల మామిడాడకు చెందిన సుబ్రహ్మణ్యం గతంలో అనంత ఉదయ భాస్కర్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర సుబ్రహ్మణ్యం రూ.70 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందులో రూ.50 వేలు ఇచ్చేశామని మృతుడి తండ్రి నూకరత్నం చెబుతున్నారు. ఇంకా రూ.20 వేలు ఎమ్మెల్సీకి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ రూ.20 వేలు విషయంలో పలుమార్లు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ తన కుమారుడు సుబ్రహ్మణ్యంకు ఫోన్‌ చేసి బెదిరించారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు మృతుడి భార్య అపర్ణ కూడా ఇదే చెబుతోంది. సుబ్రహ్మణ్యం అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. దీంతో తనను చూసుకోవడానికి తన భర్త ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడని అపర్ణ చెబుతోంది. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం కాకినాడలోని కొండయ్యపాలెంలో స్నేహితులతో కలసి ఉన్నాడు. ఆ సమయంలో అనంత ఉదయ్‌ భాస్కర్‌ కారులో అక్కడికి వచ్చి తన భర్తను తనతో ఎక్కించుకు తీసుకువెళ్లారని అపర్ణ చెబుతోంది. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ వివాహేతర సంబంధాలు, రహస్యాల గురించి తన భర్తకు తెలుసనే ఆయనను హత్య చేశారని ఆరోపిస్తోంది. 10.30కు తన భర్తను తీసుకెళ్లి తిరిగి రాత్రి 12.30 గంటల సమయంలో యాక్సిడెంట్‌లో సుబ్రహ్మణ్యం మరణించాడని తమకు ఫోన్‌ చేసి ఎమ్మెల్సీ చెప్పారని చెబుతోంది.

అయితే.. ఎమ్మెల్సీ ప్రమాదం జరిగిందని చెబుతున్న నాగమల్లితోట దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరు కారుతూ.. సముద్రపు ఇసుకతో ఎలా ఉంటుందని మృతుడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సుబ్రహ్మణ్యం పెదవి పగిలిపోయి ఉందని.. వీపు, మెడ, మోకాలు, తదితర శరీర భాగాల్లో చీరుకుపోయిన గాయాలు ఉన్నాయని.. రెండు చేతులు విరిగిపోయాయని బోరుమంటున్నారు.

ప్రమాదం జరిగితే పోలీసులకు ఫోన్‌ చేయాలని.. లేదా ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఇవేమీ చేయకుండా కారులో శుక్రవారం తెల్లవారుజామున శవాన్ని లె చ్చారని ఆరోపిస్తున్నారు. శవాన్ని వెంటనే తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి తెచ్చారని.. గద్దించారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే చేయొద్దన్నారని.. వెంటనే అంత్యక్రియలు చేయించమని పట్టుబట్టారని చెబుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ డ్రైవర్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాక మాయమైపోయారు. ఆయన ఎక్కడుందీ ఎవరికీ తెలియడం లేదు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తుందని.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీని అరెస్టు చేసేవరకు పోస్టుమార్టం చేయడానికి అంగీకరించబోమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మార్చురీకి తీసుకొచ్చినా ఇప్పటివరకు పోస్టుమార్టం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సంతకం పెట్టడం లేదని.. అందుకే తాము పోస్టుమార్టం చేయలేదని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు మృతుడు సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో దళిత సంఘాలు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మృతుడి కుటుంబానికి అండగా నిలిచాయి. ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం అధికార వైఎస్సార్‌సీపీకి తలకు రోకలిపోటులా మారింది. మరోవైపు కాకినాడ జీజీహెచ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీని అరెస్టు చేసేవరకు పోస్టుమార్టంకు ఒప్పుకునేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు తేల్చిచెబుతున్నారు. ఆస్పత్రి వద్ద నుంచి వారు కూడా కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
Tags:    

Similar News