మ‌రో వివాదంలో ఆది...క‌డ‌ప‌లో బాబుకు బీపీ

Update: 2018-05-06 16:38 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆయ‌న ఇలాకాలోనే ఇర‌కాటంలో ప‌డేయాల‌ని చూస్తున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కాలం క‌లిసి రావ‌డం లేదు. జ‌గ‌న్‌ ను దెబ్బేసేందుకు ఆయ‌న ఎంచుకున్న జంప్ జిలానీల ఎజెండా ఆయ‌న‌కే ఎదురుదెబ్బ‌గా మారుతోంది. ఒక నియోజ‌క‌వ‌ర్గం త‌ర్వాత ఒక నియోజ‌క‌వ‌ర్గం అన్న‌ట్లుగా ప‌రిస్థితులు టీడీపీ అధిష్టాన పెద్ద‌ల బీపీ పెంచేలా మారిపోతున్నాయి. వైసీపీ త‌ర‌ఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిపై ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. మంత్రి ఆది వ‌ల్ల జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ఇబ్బంది ఎదుర‌వుతోంద‌ని అధిష్టానం దృష్టికి చేరింద‌ని టాక్ ఉంది. అయితే దానికి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కూడా తోడ‌యింది.

తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కార‌ణంగా బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ముస‌లం రేగింది. ఏకంగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ ఆది తీరును పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే - సీనియ‌ర్ నాయ‌కులు వ్య‌క్తం చేసే దాకా ప‌రిస్థితి వ‌చ్చింది. మంత్రి ఆది స్థాయి ఏంటి అని సైతం ప్ర‌శ్నించే వ‌ర‌కు వెళ్లింది. మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి బద్వేలు ఎమ్మెల్యే జయరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆది తమపై పెత్తనం చేయాలని చూస్తే - అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. పార్టీకి చెందిన మ‌హిళా విభాగం నాయ‌కురాలు - యోగివేమ‌న యూనివ‌ర్సిటీ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలు విజ‌య‌జ్యోతితో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ ప‌ర‌మైన స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని, పైగా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ ర్యాలీ చేపడుతున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. పైగా మాపై నిందలు మోపటం ఏమిటని ప్రశ్నించారు. టిక్కెట్‌ ఇచ్చేది మంత్రి ఆదినారాయణరెడ్డి - మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కాదని స్పష్టం చేశారు. పార్టీ టికెట్లు అధిష్ఠానం కేటాయిస్తుందని తెలిపారు. ‘నువ్వు కూడా జంప్‌ జిలానీవే నీ అదృష్టం బాగుండి మంత్రి అయ్యావు... డబ్బులు దాచిపెట్టుకోవటానికి రాజకీయాల్లో వచ్చావు.. మేము ప్రభుత్వ ఉద్యోగాలు మానుకొని రాజకీయాలకు వచ్చాం. ఎస్సీ రిజర్వ్‌ డు నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం ఏమిటి’ అని వారు ప్రశ్నించారు. `అభ్యర్థులకు టికెట్లు నిర్ణయించేది అధిష్ఠానం... నువ్వూ - మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కాదు...మీరు మాకు సైకిల్‌ ర్యాలీ గురించి చెప్పారా?... మా హక్కులు కాలరాయాలని చూస్తారా? దళితులమని చిన్నచూపు చూస్తే సహించేది లేదు` అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ తీరుపై ఎమ్మెల్యే జ‌య‌రాములు మండిప‌డ్డారు. ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థులను ఇన్‌ఛార్జులుగా ప్రకటించారని, ఈ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి అంశంలో కొందరు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మపై గౌరవం ఉంటే వారి ఇంటికి తీసుకవెళ్లి చీర, సారె పెట్టి గౌరవించాలని చెప్పారు. దళితులపై చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ఇవే పరిస్థితులు పునరావృతమైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అధిష్ఠానం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒకే దీక్షా శిబిరం ఏర్పాటు చేయమంటే రెండింటిని ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సమస్యలను పరిష్కరించడానికి రాలేదని మరింత పెంచేందుకు వచ్చారని ఆరోపించారు. పార్టీ మహిళా నేత విజయ జ్యోతి మాట్లాడుతూ  మంత్రి ఆది అహంకారంతో మాట్లాడతున్నరని, తమను దళితులమని చిన్నచూపు చూస్తే సహించేది లేదని హెచ్చ‌రించారు. విజయమ్మ కార్యకర్తలకు, నాయకులకు  సమన్యాయం చేసి ఉంటే వారెందుకు తమ వద్దకు వస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అందరు నాయకులు కలసి పనిచేపేలా సమన్వయం చేయమంటే కలహాలు పెట్టి విడతీయాలని చూస్తున్నట్లు పరిస్థితి ఉందన్నారు.

Tags:    

Similar News