మోడీ సీరియస్ ...ఏపీకే ఫస్ట్ షాక్... ?

Update: 2022-04-19 17:30 GMT
మన దగ్గర ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టే ఖర్చు చేయాలి. లేకపోతే అప్పులు తెచ్చి పప్పు కూడు వండితే ఏదో నాడు మొత్తానికి గల్లంతు అవుతుంది. ఇది అందరికీ తెలిసిన సాధారణ ఆర్ధిక సూత్రం. మరి ఇదే సూత్రం రాష్ట్రాలను  ఏలిన వారికి పట్టదా. అంటే అక్కడ మంది సొమ్ము ఖర్చు చేస్తారు. అందుకే మందికి అప్పులు తెచ్చి నెత్తిన పెట్టినా బే ఫికర్ గా ఉంటారన్న మాట.

నాలుగు దశాబ్దాల నాడు మెల్లగా మొదలైన ఉచిత పధకాల వ్యవహారం ఇపుడు హద్దులు దాటేసింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఆల్ ఫ్రీ బాబులు తయారైపోతున్నారు. కొందరు ఉచితాల కోసం మౌలిక సదుపాయాలకు కూడా పైసా విదిలించలేని పరిస్థితికి రాష్ట్రాలను తీసుకు వస్తున్నారు. దీంతో కేంద్రం ఈ  తరహా ఉచితాలకు చెక్ పెట్టాలని సీరియస్ గానే చూస్తోంది అంటున్నారు.

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఇపుడు భారత దేశంలో అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన శాఖల కార్యదర్శులతో కొన్ని గంటల పాటు సమావేశాలను నిర్వహించి మరీ దేశంలో ఆర్ధిక  పరిస్థితులను మధింపు వేశారు. అలాగే నీతి అయోగ్ సభ్యులతోనూ చర్చించారు. ఈ మొత్తం చర్చలలో కేంద్రానికి అర్ధమయ్యేటట్లుగా ఉన్నతాధికారులు వివరించారు అని చెబుతున్నారు.

దేశంలో ఇపుడు ఉచితాల జాతర సాగుతోందని, దాన్ని కనుక కట్టడి చేయకపోతే మాత్రం శ్రీలంక కష్టాలు దేశంలోని చాలా రాష్ట్రాలలో వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక పంజాబ్ లో ఆప్ సర్కార్ అధికారంలోకి రావడానికి అనేక ఉచితాలను ప్రకటించింది. అందులో కీలకమైనది మూడు వందల యూనిట్ల వరకూ ఉచితం. అలాగే ప్రతీ కుటుంబానికి నెలకు వేయి రూపాయల నగదు బదిలీ పధకం. దీని వల్ల అదనంగా ఇరవై వేల కోట్ల భారం ఖజానా మీద పడనుంది.

ఇక ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ సర్కార్ కూడా ఏమీ తీసిపోలేదు. ఎన్నికల్లో గెలవడానికి కాషాయం పెద్దలు అనేక ఉచితాలు ప్రకటించి ఉన్నారు. ఏకంగా ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందచేస్తామని భారీ హామీ ఇచ్చేసింది. లక్షల కోట్ల రుణాలను యూపీ ఇప్పటికే తీసుకుంది. ఇపుడు దానికి మరింత భారం అయ్యేలా ఈ హామీలు ఉన్నాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే లక్షల కోట్ల రూపాయలను కేవలం నగదు బదిలీ పధకాలకే కేటాయిస్తున్నారు. దేశంలో తామే సంక్షేమంలో నంబర్ వన్ అని వైసీపీ సర్కార్ పదే పదే  చెప్పుకుంటోంది. పదుల సంఖ్యలో పధకాలు ఏపీలో అమలు అవుతున్నాయి. మరి ఆ పధకాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది అంటే అప్పు చేయడం వల్లనే. ఇప్పటికే చూస్తే ఏపీకి ఏడు లక్షల కోట్ల పై చిలుకు అప్పులు ఉన్నాయి.

ఇంకా రెండేళ్ల పాలన ఉంది. మరిన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తేనే తప్ప ఈ సంక్షేమ రధం ముందుకు కదలదు. అలా కనుక చేసుకుంటూ పోతే ఏపీ కూడా మరో శ్రీలంక అవుతుంది అని హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ఉచితాల మీద హద్దూ పద్దూ లేకుండా వీరావేశంతో సాగిపోయే రాష్ట్రాలకు కళ్ళెం వేయడానికి రెడీ అవుతోంది అంటున్నారు.

దీని కోసం నీతి ఆయోగ్ వంటి వాటితో పాటు,  ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సలహా సూచనలు తీసుకోవడం, అలాగే, ఎఫ్ఆర్‌బీఎం కమిటీతో మరిన్ని సమావేశాలను నిర్వహించిన మీదట కేంద్రం కీలకమైన ఆదేశాలను దేశం మొత్తానికి జారీ చేసే విధంగా అడుగులు వేస్తుంది అంటున్నరు. దీని వల్ల మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఉచితానికి భారీ ఎత్తున కోత పడుతుంది అంటున్నారు.

ఇప్పటికే  ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని ఏపీ దాటేసింది. దాంతో ఇక మీదట కొత్త అప్పులు పుట్టకుండా కఠినంగా రూల్స్ ని అమలు చేస్తే కనుక ఒక్క పైసా కూడా తెచ్చుకోవడానికి వీలు ఉండదు. అయితే ఆర్ధిక  క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సర్కార్ భావిస్తున్నందువల్ల ఏపీకి భారీ  కటింగ్ తప్పదు అని తెలుస్తోంది. మరి అదే జరిగితే రాజకీయంగా కూడా వైసీపీ మీద పెను ప్రభావం చూపడం ఖాయం. ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News