జీ 20 సమ్మిట్ లో బ్రిటన్ ప్రధానితో మోదీ మాటామంతి..!

Update: 2022-11-15 12:30 GMT
కరోనా తర్వాత నుంచి బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. దీనికితోడు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ పై అనేక ఆరోపణలు రావడంతో ఆయన తన పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ ప్రవాస భారతీయుడు రిషి సునాక్ పై అత్యధిక మెజార్టీ సాధించి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మూడో మహిళగా లిజ్ ట్రస్ రికార్డు సృష్టించారు.

ఈ క్రమంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లిజ్ ట్రస్ అనేక కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. అయితే సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో పాటు పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో మరోసారి బ్రిటన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో లిజ్ ట్రస్ సైతం ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ అవకాశాన్ని ప్రవాస భారతీయుడు రిషి సునాక్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రధాని పదవీ రేసులో మరోసారి నిల్చుని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ఆయనకు పోటీ ఇచ్చేందుకు ఎవరూ సిద్ధ పడకపోవడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక భారతీయుడు బ్రిటన్ దేశానికి ప్రధాని కావడంతో చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక తాజాగా ఇండోనేషియాలో జీ 20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు 20 దేశాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయా దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరంతా కూడా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

కరోనా నిర్మూలన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం.. రష్యా-ఉక్రెయిన్ వార్.. ఆర్థిక మాద్యం.. ఆహార భద్రత.. ఇంధన భద్రత తదితర ముఖ్యమైన అంశాలపై జీ20 దేశాల అధిపతులు చర్చించనున్నారు. జీ 20 సమ్మిట్ తొలి సెషన్ కు హాజరైన ప్రధాని మోదీ ఆహారం.. ఇంధన భద్రత.. ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రస్తావించారు

ఈ క్రమంలోనే ఇటీవల బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. రిషి సునాక్ పలు అంశాలను మోదీకి వివరించగా ఆయన శ్రద్ధగా విన్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ను మోదీ భుజం తట్టి అభినందించారు.

రిషి సునాన్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీని కలుసుకోవడం ఇదే తొలిసారి. జీ 20 సదస్సు వీరి కలయికకు వేదికగా మారింది. ఇద్దరు దేశాధినేతలు (భారతీయులు) జీ 20 లాంటి ప్రతిష్టాత్మక వేదికను ఒకేసారి పంచుకోవడం అపూర్వమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది జీ 20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News