‘ఆ కథనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. కుట్ర కోణాన్ని చెక్ చేసుకోండి జగన్’

Update: 2021-03-09 14:30 GMT
పార్టీలోనే ఉంటూ.. అధినాయకత్వానికి ఏ మాత్రం మింగుడుపడని రీతిలో వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతల్లో నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు ముందుంటారు. గడిచిన కొద్ది కాలంగా ఆయన తన అసంత్రప్తిని ఏదో రీతిలో బయటపెడుతూనే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్షం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేకపోయింది. అదే సమయంలో తన లక్ష్మణ రేఖను దాటకుండా చురుకు పుట్టేలా మాట్లాడే రఘురామ తాజాగా పార్టీ అధినేత జగన్ కు సలహా ఇచ్చిన తీరు సంచలనంగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక ఏదో భారీ కుట్ర జరుగుతుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఎం జగన్ జైలుకు వెళితే.. ఆయన పదవిని దక్కించుకోవాలన్న కుట్రం ఉందన్న ఆయన.. తనకు తెలిసి సీఎంపై కుట్ర చేసే ధైర్యం ఉంటుందని తాను అనుకోవటం లేదన్నారు. రిపబ్లిక్ టీవీలో ప్రసారమైన సంచలన కథనాన్ని తేలిగ్గా తీసుకోవద్దన్నారు.

‘అందులో ఎంతో కొంత నిజం లేకపోతే.. ఆ వార్త రాదు. సీఎం జగన్ ఆ వార్తను తేలిగ్గా తీసిపారేయొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక ఎవరైనా దొంగ వెధవలు ఉండి కుట్ర చేస్తున్నారేమో కాస్త చెక్ చేసుకోవాలన్నారు. ‘నిజమైన బ్లాక్ షీప్ ను పట్టుకోండి. ముందు చెక్క భజన చేస్తూ వెనుక గోతులు తీస్తున్నారేమో అనుమానంగా ఉంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Tags:    

Similar News