మనసున్న మారాజు ధోనీ...మరోసారి నిరూపించాడు

Update: 2020-08-22 17:30 GMT
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీకి మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. క్రికెట్ గ్రౌండ్ లోపల, బయటా `మిస్టర్ కూల్` గా వ్యవహరించే ధోనీ కోట్లాది హృదయాలను కొల్లగొట్టాడు. మైదానం బయట ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం...అంతర్జాతీయ స్థాియిలో అద్భుతమైన ప్రదర్శన...ఈ రెండింటి మేలికలయికతో ధోనీ ఓ అరుదైన, ప్రత్యేకమైన ఆటగాడిగా...అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు పొందాడు. ధోనీని ఎందుకు అందరూ ఇష్టపడతారో...ధోనీది గొప్ప మనసో తెలిపే తాజా ఘటన ఒకటి ధోనీ విమాన ప్రయాణం సందర్భంగా జరిగింది. యూఏఈలో జరగబోతోన్న ఐపీఎల్-2020లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తున్న ధోనీ...తన బిజినెస్ క్లాస్ సీటును ఎకానమీ క్లాస్ లో ఉన్న ఓ ప్రయాణికుడికి ఇచ్చాడు. ఈ ఘటనను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు(సీఎస్ కే) సిబ్బంది ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.

ఆగస్టు 15న తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ధోనీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్-2020పై ధోనీ ఫోకస్ పెట్టాడు. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు సీఎస్ కే సభ్యులు, సిబ్బందితో కలిసి ధోనీ యూఏఈ వెళుతున్నాడు. ఆ సందర్భంగా ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న 39 ఏళ్ల వ్యక్తిపై ధోనీ దృష్టి పడింది. అతడి కాళ్లు పొడుగుగా ఉండడంతో సీటులో చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు. ఇది గమనించిన మిస్టర్ కూల్ ఎంఎస్ డీ...తన బిజినెస్ క్లాస్ సీటును ఆ వ్యక్తికి ఇచ్చేసి....అతడి ఎకానమీ క్లాస్ సీటులో కూర్చున్నాడు. ధోనీ కోరుకుంటే ఆ వ్యక్తితోపాటు తనకూ బిజినెస్ క్లాసులోనే ఓ సీటును విమాన సిబ్బంది కేటాయించి ఉండేవారేమో. కానీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనన్న సూత్రాన్ని నమ్మే ధోనీ....టాప్ సెలబ్రిటీ హోదా ఉండి కూడా సామాన్యుడిలా ఎకానమీ క్లాసులోనే ప్రయాణించాడు.

ధోనీ గొప్ప మనసును చాటి చెప్పే ఆ ఘటన వీడియోను సీఎస్ కే సిబ్బందిలో ఒకరైన జార్జ్ అనే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. జీవితంలో అన్ని ఒడిదుడుకులు అనుభవించిన వ్యక్తి...క్రికెట్ లో అత్యున్నత స్థాయి ప్రదర్శనను కనబరిచిన వ్యక్తి మాత్రమే ఇంత గొప్ప పని చేయగలడు అంటూ జార్జ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా కెప్టెన్ తాను చేసే గొప్ప పనులతో నన్ను ఎల్లపుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడని జార్జ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు...ధోనీ మనసున్న మారాజు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బిజినెస్ క్లాస్ ఆర్ ఎకానమీ క్లాస్....ధోనీ ఈజ్ ది బాస్ అంటూ ఎంఎస్ డీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News