ముఖేష్ అంబానీకి జియో క‌ష్టాలు షురూ

Update: 2016-10-18 10:13 GMT
రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీకి త‌న క‌ల‌ల ప్రాజెక్టు  జియోతో క‌ష్టాలు మొద‌ల‌యిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇంట‌ర్ క‌నెక్టివిటీ విషయంలో ఇతర టెలికాం ఆపరేటర్లు కొత్తగా వచ్చిన తమను (జియోను) ‘వేధిస్తున్నారని’ (ర్యాగింగ్‌ చేస్తున్నారని) స్వ‌యంగా ముఖేష్ అంబానీ వాపోయారు. ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అంబానీ మాట్లాడుతూ ఒక తెలివైన విద్యార్థికి ఎదురయ్యే ర్యాగింగ్‌ వంటిదే సంస్థా పరంగా తామూ ఎదుర్కొంటున్నామన్నారు. ‘అవును.. మాకూ సమస్యలున్నాయి. ఒక తెలివైన విద్యార్థికి ప్రతిష్ఠాత్మక సంస్థలో చేరితే.. కేవలం అతని తెలివితేటలకు ఓర్వలేక హాస్టల్‌లోని విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు - అత్యాధునిక సాంకేతికత, విస్తారమైన నెట్‌ వర్క్‌ తో వస్తున్న మా సంస్థ కూ అదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి’ అని అంబానీ వివరించారు. ‘నేను - నా కంపెనీ ఆ వేధింపులు భరిస్తాం కానీ.. లక్షల కొద్దీ వినియోగదార్ల విషయంలో దాన్ని మేం సహించబోం’ అని ముకేశ్ హెచ్చ‌రించారు. త్వరలోనే ‘వారు’ ఈ ‘ర్యాగింగ్‌’ ఆపుతారనే మేం భావిస్తున్నామని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

త‌న క‌ల‌ల ప్రాజెక్టు గురించి ముఖేష్ అంబానీ మ‌రింత వివ‌రిస్తూ "2010లో మా అమ్మాయి ఇషా అంబానీ ‘ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంది నాన్నా’ అని చెప్పింది. అప్పుడే దేశ యువత ఆకాంక్షలకు అనువైన సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచించా. అది సాకారం అయ్యేందుకు యువ సారధులు ఎంతో శ్రమించారు’ అని ముకేశ్‌ అంబానీ వివరించారు. 'మా కొత్త కంపెనీ జియోపై ఇప్పటిదాకా రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. 4జీ సేవలను దేశం అంతటా అందించడం కోసం రెండో దఫా పనులకు కలిపి మొత్తం రూ.2,50,000 కోట్లు పెట్టుబడులుగా పెడుతున్నాం. ప్రపంచం ఇపుడు ఆలోచనల గని కిందకు మారింది. ఆర్థిక వనరులనేవి ఇపుడు సమస్యే కాదు’ అని ఆయన వివరించారు. జియో మనుగడ - లాభదాయకతపై కొంత మంది ఆర్థిక విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘వారి ఆలోచనలు సరి కాదు. బాగా ఆలోచించిన తర్వాతే దీనిని తీసుకొచ్చాం. అత్యుత్తమంగా తీర్చిదిద్దిన వ్యాపారమిది. టెక్నాలజీ కంపెనీల వ్యవహారశైలిని సాధారణంగానే ఆర్థిక మార్కెట్లు సరిగా అర్థం చేసుకోలేవు. యాపిల్‌ - గూగుల్‌ ల విషయంలోనూ అదే జరిగింది. వారందరూ(ఆర్థిక విశ్లేషకులు) తప్పు అని మేం నిరూపిస్తాం. మేం వెలువరిచే ఒక్కో త్రైమాసిక ఫలితాలనూ చూస్తూ ఉండండి. అపుడు మీకే అర్థమవుతుంది. 12 ప్రాంతీయ భాషల్లో అత్యుతన్న నాణ్యతతో డేటా అనుబంధ సేవలు అందించడానికి జియో తీవ్రంగా పరిశ్రమిస్తోంది. 2018-19 కల్లా స్థానిక కంటెంట్‌ ను తీసుకువస్తాం'  అని ముఖేష్ ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News