జనసేనను దెబ్బతీయడానికే బీఆర్‌ఎస్‌: జనసేన ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-06 05:28 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పై ఏపీలో వివిధ పార్టీలు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీని దెబ్బతీసి తన మిత్రుడు, ఏపీ సీఎం జగన్‌ కు మేలు చేయడానికే కేసీఆర్‌ ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణ దృష్టి సారించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి, అక్కడ కీలకమైన సామాజికవర్గమైన రెడ్ల ఓట్లను కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా చేయడానికే షర్మిలతో జగన్‌ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయించారని అప్పట్లో టాక్‌ నడించింది. ఇలా మిత్రులిద్దరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్, జగన్‌ పై విమర్శలు చేస్తున్నాయి.

తాజాగా జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ సైతం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు సహాయం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని నాదెండ్ల ఆరోపించారు. జనసేన పార్టీ ఓట్లు చీల్చి జగన్‌ కు లబ్ధి చేకూర్చడమే కేసీఆర్‌ ఉద్దేశమని మండిపడ్డారు.

విశాఖలోని శివాజీపాలెంలో జనవరి 12న జనసేన పార్టీ నిర్వహించనున్న యువశక్తి కార్యక్రమ కరపత్రిక ఆవిష్కరణ అనంతరం నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్‌ ఎలా ఉపయోగపడతారో చెప్పాలని నిలదీశారు. అలాగే కృష్ణా-గోదావరి జలాల విషయంలో కేసీఆర్‌ ప్రణాళిక ఏమిటో వివరించాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ఎలాంటి ఆలోచనతో వచ్చి ఏ సేవ చేయగలరో కేసీఆర్‌ చెప్పాలన్నారు.

175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్తే అంత అభద్రతా భావం ఎందుకో అర్థం కావడం లేదని నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల సభలను అడ్డుకునేందుకు చీకటి జీవోలు ఇస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనోహర్‌ తెలిపారు. రణస్థలంలో సభకు అనుమతులు కోరుతూ డీజీపీకి, శ్రీకాకుళం ఎస్పీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. యువశక్తి నిర్వహణపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశామన్నారు.

కాగా మనోహర్‌ తరహాలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం. తెలంగాణలో బండి సంజయ్, ఏపీలో పవన్‌ కల్యాణ్‌ ను దెబ్బతీయడానికే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్‌ విమర్శలపై కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News