తమ్ముడి కోసం : నాగబాబు రాజకీయ మంత్రాంగం...?

Update: 2022-05-31 00:30 GMT
కొణిదెల నాగబాబు అటు అన్న చిరంజీవికి అనుంగు తమ్ముడు.  ఇటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి  పొలిటికల్ గా నచ్చే అన్న ఆ మెగా హీరోలు ఇద్దరు మధ్యన ఉండే మధ్యముడు అర్జునుడు లాంటి వారు. ఆయన అన్నకు తమ్ముడిగా తమ్ముడికి అన్నగా తనదైన పాత్రను సమర్ధంగా పోషిస్తూ వస్తున్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ వేళ చిరంజీవి వెన్నంటి ఉన్న నాగబాబు ఉమ్మడి ఏపీ అంతటా తిరిగారు. మెగా ఫ్యాన్స్ ని పార్టీ క్యాడర్ గా మార్చడంతో ఆయన పాత్ర చాలా కీలకమైనది.

ఒక విధంగా చెప్పాలీ అంటే మెగా ఫ్యాన్స్ తో ఎప్పటికపుడు టచ్ లో ఉంటూ అటు మెగాస్టార్ కి ఇటు ఫ్యాన్స్ కి మధ్య అచ్చమైన వారధిగా నాగబాబు  చురుకైన  పాత్రనే పోషించారు అని చెబుతారు. ఇక ప్రజారాజ్యం టైమ్  లో ఆయన పోటీ చేయలేదు, ప్రజారాజ్యం ఓడిన తరువాత రాజకీయాల నుంచి కూడా కొంతకాలం దూరం అయ్యారు.

తిరిగి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించడంతో మెగా ఫ్యామిలీ నుంచి తమ్ముడికి మద్దతుగా ఈ వైపు వచ్చారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోక్ సభకు అభ్యర్ధిగా పోటీ చేసిన నాగబాబు ఓడినా మంచి సంఖ్యలో ఓట్లను సాధించారు. ఒక విధంగా వైసీపీ అభ్యర్ధిగా నాడు నిలబడిన రఘురామక్రిష్ణంరాజుకు చుక్కలే చూపించారు.

ఎన్నికల్లో పరాజయం తరువాత కూడా నాగబాబు జనసేనలో చురుకుగా లేరు. ఓడిన తరువాత ఆయన్ 2019లో విశాఖ టూర్ పెట్టుకున్నారు. నాడు గాజువాక వెళ్ళి మరీ తమ్ముడు పవన్ ఓటమి మీద పోస్ట్ మార్టం చేశారు. ఆ తరువాత ఎందుకో ఆయన కనిపించలేదు తిరిగి ఇన్నాళ్ళ తరువాత నాగబాబు యాక్టివ్ అవుతున్నారు.

ఆయన మీద జనసేన కూడా గట్టి నమ్మకం పెట్టుకుని కొన్ని బాధ్యతలను అప్పగించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా ఉభయగోదావరి జిల్లాలలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను నాగబాబుకు అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం జిల్లాలలో జనసేనకు మంచి బేస్ ఉంది. అలాగే మెగాభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు.

వారంతా జనసేన కోసం ఉరకలు వేస్తున్నారు. వారు ఉత్సాహాన్ని పార్టీ వైపుగా మళ్ళించి పటిష్టం చేయడానికి నాగబాబు రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. నాగబాబు ఉత్తరాంధ్రాలో తాజాగా మూడు రోజుల పాటు జరపనున్న టూర్ అయితే ఆసక్తిని రేపుతోంది. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి విశాఖ దాకా నాగబాబు బిజీగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమి కోరుకుంటున్నారు. పార్టీ క్యాడర్ నుంచి ఏమి ఆశిస్తోంది అన్నది వారికి తెలియచెప్పి దిశానిర్దేశం చేయనున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే నాగబాబు టూర్ లో ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయని అంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను ఆరా తీయడమే కాకుండా జనసేనకు ఉన్న బలం ఎంత, ఏం చేస్తే ఇంకా పటిష్టం అవుతుంది అన్న దాని మీద నాగబాబు ఫోకస్ పెడతారు అని అంటున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రాలో పోటీ చేస్తారు అని చాలా కాలంగా వినిపిస్తోంది. దాంతో ఆయన పోటీ చేసే సీటు గురించి కూడా అన్వేషించాలని నాగబాబు భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు ఉత్తరాంధ్రా టూర్ అయితే రాజకీయ వర్గాలలో ఉత్కంఠనే రేపుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News