జ‌గ‌న్‌ను నిలదీయండి.. ఏపీ బీజేపీకి మోడీ క్లాస్‌!

Update: 2022-11-12 16:30 GMT
ఏపీలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ.. బీజేపీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏకేయాల‌ని ఆయ‌న గ‌ట్టిగా చెప్పిన‌ట్టు తెలిసింది.  వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు రూపొందించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని  ప్రధాని  దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు.

విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ సుమారు గంటన్నరసేపు పార్టీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా నేతలను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలని సూచించారు.

రాష్ట్రాభివృద్ధికి వివక్ష చూపకుండా కేంద్రం ఎంతో కృషి చేస్తోందని...వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని తీవ్రస్థాయిలో ఎండగట్టాలని.. ఇందుకు వెనుకాడొద్దని స్పష్టంచేశారు.

రాజకీయాల్లో నిదానం పనికిరాదని.. నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారని పార్టీ నేతలు హితవు పలికారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతూనే ఉండాలన్నారు.  అభివృద్ధి కోసం మనం చేసే కృషి గురించి ప్రజలకు తెలియాలి కదా అని ప్రధాని వివరించారు. అభివృద్ధి గురించి చెప్పడంలో,ప్రభుత్వ లోపాలు ఎండగట్టడంలో వెనుకాడొద్ద‌ని మోడీ త‌న పార్టీ నేత‌ల‌కు తేల్చిచెప్పారు.

అంగన్వాడీల దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగాలని.. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందు తుందో లేదో మహిళా మోర్చల ద్వారా నిశితంగా పరిశీలించాలని ప్రధాని సూచించారు. యువకులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించాలని..  ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ఇప్పటికే రాజకీయాలపై ప్రజల్లో విసుగొచ్చిందని.. ఈ పరిణామాల్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు పార్టీని చేరువ చేయాలని కర్తవ్యబోధ చేశారు.

పార్టీ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఏంచేశారు? శక్తికేంద్రాలు ఎన్ని ఉన్నాయి? పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు?' అని ప్రధాని మోడీ రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై సభలు నిర్వహించామని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News