మోడీ ప్రోగ్రాంకు రావొద్దంటూ కేరళ సీఎంకు షాక్

Update: 2015-12-14 06:13 GMT
ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నారంటే.. ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించటం.. స్వాగతం పలకటం లాంటివి చేస్తుంటారు. కానీ.. కేరళలో అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకోవటమే కాదు.. ఊహించని షాక్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బిత్తరపోయే పరిస్థితి. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేరళకు నరేంద్రమోడీ వస్తున్నారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దివంగత శంకరన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఆహ్వానించారు.

అయితే.. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న వెల్లపల్లి నటేశన్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో.. భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని కార్యక్రమానికి రావొద్దంటూ కోరటం ఇప్పుడు వివాదాస్పదమైంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో.. తమ పార్టీకి చెందిన ఒకసీనియర్ నేత విగ్రహావిష్కరణ సభకు తమను ఆహ్వానించి.. మళ్లీ వద్దని చెప్పటంపై కేరళ కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు.

అయితే.. ఈ విషయాల్ని నటేశన్ గ్రూప్ పట్టించుకోవటం లేదు. ప్రధాని వస్తున్న కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉన్నా.. నిర్వాహకుల తీరుతో.. ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.
Tags:    

Similar News