హైదరాబాద్ లో బ్యాంక్ క్యాషియర్ చేసిన పని తెలిస్తే నోట మాట రాదంతే

Update: 2022-05-11 08:49 GMT
హైదరాబాద్ మహానగరంలోని ఒక బ్యాంకు క్యాషియర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. మహానగర శివారులోఉండే వనస్థలి పురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో పని చేసే క్యాషియర్ ప్రవీణ్.. ఎప్పటిలానే ఈ రోజు బ్యాంకు విధులకు హాజరయ్యాడు. కాసేపటికే కడుపులో నొప్పిగా ఉందన్నాడు.

దీంతో.. కడుపు నొప్పికి ట్యాబ్లెట్ కోసం బ్యాంకు నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత మళ్లీ రాలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా షాక్ తిన్నారు.

చెక్ చేస్తే.. బ్యాంకుకు చెందిన రూ.22.53 లక్షల మొత్తాన్ని తనతో తీసుకెళ్లినట్లుగా తేలటంతో బ్యాంకు సిబ్బంది అవాక్కు అయ్యారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించారు బ్యాంకు సిబ్బంది.

వెంటనే స్పందించిన పోలీసులు.. క్యాషియర్ ప్రవీణ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. అంతేకాదు.. అతని ఇంటికి వెళితే.. అతని కుటుంబ సభ్యులు సైతం అందుబాటులోకి లేరన్న విషయాన్ని గుర్తించారు.

దీంతో.. పక్కా ప్లాన్ తోనే బ్యాంకు సొమ్మును తీసుకొని వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదంటున్నారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ గా ఉంటూ ఇలాంటి పాడు పని చేయటమా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు బ్యాంకు సిబ్బంది.
Tags:    

Similar News