కష్టమొకళ్ళదయితే సోకులు బీజేపీవా ?

Update: 2022-09-16 06:31 GMT
దేశంలో బీజేపీ ప్రస్తుత వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఏదో పద్దతిలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ గా పెట్టుకున్నది. అందుకనే అందుబాటులో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఎంఎల్ఏలను ఏదోపద్దతిలో లొంగదీసుకుని తమలో కలిపేసుకుంటోంది.

దీనివల్ల చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని చెప్పుకుంటోంది. అంటే ఇతర పార్టీల తరపున ఎన్నికైన ఎంఎల్ఏలను కూడా తమ ఎంఎల్ఏలుగానే చెప్పేసుకుంటోంది. కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు తాజాగా గోవాలో ఏమి జరిగిందో అందరు చూస్తున్నదే.

ఇదే వరసలో తెలంగాణా విమోచన వేడుకలను కూడా బీజేపీ సొంతం చేసేసుకుంటోంది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం రాష్టాన్ని  అంటే ప్రస్తుత తెలంగాణాను భారత ప్రభుత్వంలో కలిపేసేందుకు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అంగీకరించారు. మొదట్లో బెట్టు చేసిన సైనిక చర్య తప్పదని అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించటంతో చేసేది లేక అంగీకరించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే నిజాం పాలనపై దశాబ్దాలపాటు పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలే. వీళ్ళకు జనాలు బాగా మద్దతిచ్చారు. ఇందులో అప్పటి జన్ సంఘ్ లేదా సంఘ్ పరివార్ పాత్ర ఒక్క శాతం కూడా లేదు. జన్ సంఘే తర్వాత జనతా పార్టీగాను కాలక్రమంలో బీజేపీగాను రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే.

అప్పటి జన్ సంఘ్ కే నిజాం ప్రభుత్వం లొంగుబాటులో పాత్రలేదంటే ఇప్పటి బీజేపీకి అసలు సంబంధమే లేదని స్పష్టంగా చెప్పచ్చు. అయితే విచిత్రంగా నిజాం విమోచనంతా తమ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందన్నట్లుగా  ఇప్పటి బీజేపీ నేతలు తెగ హడావుడి చేసేస్తున్నారు.

అప్పటి రజాకార్ల ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటాల చరిత్ర తెలియని ఇప్పటి యువత నిజాం లొంగుబాటులో బీజేపీ దే ప్రముఖపాత్రగా భ్రమపడే అవకాశముంది. తెలంగాణా విమోచన దినోత్సవం పేరుతో 17వ తేదీన ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను పిలిపించి చేస్తున్న హడావుడంతా జనాలని భ్రమల్లో ముంచటానికేనా ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News