'గ్రౌండ్ రిపోర్ట్: నిజామాబాద్‌'లో గెలుపెవరిది..?

Update: 2019-04-04 05:50 GMT
పార్లమెంట్ నియోజకవర్గం: నిజామాబాద్

టీఆర్‌ ఎస్‌: కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌: మధుయాష్కి గౌడ్‌
బీజేపీ: ధర్మపురి అరవింద్‌

*170కు పైగా ఎర్రజొన్న రైతులు నామినేషన్ వేశారు..

స్థానికులతో పాటు స్థానికేతరులను గెలిపించే నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ లో ఇప్పటివరకు కాంగ్రెస్‌ 11 సార్లు జెండా ఎగురవేసింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి కార్యకర్తలు కూడా కరువయ్యారని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత 2014 ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లలో నియోజకవర్గంపై పట్టు బిగించారు. అలాగే డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పరిధిలోని అన్ని నియోజకవర్గాలను గెలిపించుకున్నారు. ఆ బలంతో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుచున్నారు. అయితే రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మధుయాష్కి గౌడ్‌ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి గెలుస్తానని కవితతో పోటీకి నిలబడ్డాడు. ఇక బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తమ సమస్యలు పరిష్కరించలేదని 170కు పైగా ఎర్రజొన్న రైతులు కవితపై పోటీకి నామినేషన్ వేయడం గమనార్హం.

*  నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం చరిత్ర

అసెంబ్లీ నియోజకవర్గాలు: నిజామాబాద్‌ అర్బన్‌ - నిజామాబాద్‌ రూరల్‌ - బాల్కొండ - ఆర్మూర్‌ - కోరుట్ల - జగిత్యాల

ఓటర్లు: 15 లక్షల 53 వేలు
 
1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఆ సమయంలో జరిగిన  ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసిన హరీశ్‌ చంద్ర గెలుపొందారు. ఆ తరువాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఆయన హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పటి వరకు 16 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ 11 సార్లు - టీడీపీ మూడుసార్లు జెండా ఎగురవేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ గెలుపొందింది.

* మెజారిటీ పైనే కవిత దృష్ఠి:

2014 ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ తరుపున పోటీ చేసిన కవిత లక్షా 60 వేల మెజారిటీతో గెలుపొందారు. డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కలిపి 2 లక్షల మెజారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న కవిత భారీ మెజారిటీ సాధించాలని పట్టుతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. నిజామాబాద్‌ - పెద్దపల్లి మధ్య ప్యాసింజర్‌ రైలును తీసుకొచ్చారు. మండలాలు - గ్రామాల వారీగా నిత్యం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు విడుదల చేయించి డ్రైనేజీ వ్యవస్థను చక్కబెట్టారు. అయితే ఇటీవల పసుపు ఏర్పాటు చేయకపోవడంపై రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది.

* అనుకూలతలు:

-అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం
-ఆసుపత్రుల్లో సొంతంగా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం
-మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం

* ప్రతికూలతలు:

- హామీల్లో భాగంగా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించకపోవడం
-పసుపు - ఎర్రజోన్న రైతుల తీవ్ర అసంతృప్తి

* మధుయాష్కి గెలుస్తాడా..?

2004 - 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరుపున గెలుపొందిన మధుయాష్కి 2014 టీఆర్‌ ఎస్‌ హవాలో ఓడిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కీలక నేతగా పనిచేశారు. అయితే నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం ఢిల్లీలోనే ఉంటూ కాలం గడిపారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం  కాంగ్రెస్‌ తరుపున పోటీ చేస్తున్న మధుయాష్కికి పార్టీ బలం లేనట్లే. అయినా బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అయినందున తనకు కలిసివస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

* అనుకూలతలు:

-తాను ఎంపీగా ఉన్న హయాంలో పాసుపోర్టు కేంద్రాన్ని తీసుకురావడం
-తెలంగాణ వర్సిటీ - రైల్వేలైన్‌ తీసుకురావడం
-బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం

* ప్రతికూలతలు

-అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు లేకపోవడం
-ఐదేళ్లలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడం

* డీఎస్ కొడుకు బీజేపీ నేతగా బరిలో..

మోదీ ఇమేజ్‌ - స్థానిక నేత అని బీజేపీ నుంచి బరిలోకి దిగిన ధర్మపురి శ్రీనివాస్ కొడుకు అరవింద్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మాత్రం టీఆర్‌ ఎస్‌ - కాంగ్రెస్‌ ల మధ్యే పోరు సాగనుంది. బీడీ కార్మికులు ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉండనున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.

* రైతుల నామినేషన్ అయినా కవితకే మొగ్గు

నిజామాబాద్ జిల్లాలోని ఎర్రజొన్న  - పసుపు రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని 200కు పైగా నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది. అయినా కవిత మాత్రం మిగతా పార్టీలకు అందనంత ఎత్తులో ఉన్నారు. ఆమె గెలుపు ఇక్కడ గ్యారెంటీగానే కనిపిస్తోంది.



Tags:    

Similar News