ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఓ ప్రాధాన్యత లేని పదవి!

Update: 2022-06-17 08:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జగన్‌ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు సమసింది. జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ తో మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్న ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి జగన్ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్ట్స్ కొనుగోలు విభాగం కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా తమను ఇబ్బందిపెట్టిన ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డరంటూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్‌ అధిపతిగా కీలక పాత్ర పోషించారు.. ఏబీ వెంకటేశ్వరరావు. అయితే 2019 శాసనసభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఏబీని లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర కీలకమని జగన్‌ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో చేరడం వెనుక ఉంది ఆయనేనని బలంగా విశ్వసిస్తోంది

అంతేకాకుండా తమ ఫోన్లను ట్యాప్‌ చేయడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు వెనుక చక్రం తిప్పింది కూడా ఏబీ వెంకటేశ్వరరావేనని విమర్శలు గుప్పిస్తోంది. ఏబీ కుమారుడికి చెందిన కంపెనీయే పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలులో కీలక పాత్ర పోషించిందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏబీ వెంకటేశ్వరరావును లక్ష్యంగా చేసుకుంది. అందులోనూ ఏబీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీ ఆయన చెప్పినట్టు చేశారని వైఎస్సార్‌సీపీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగా 2020 ఫిబ్రవరి 8న ఏబీని విధుల్లోంచి తొలగించింది. అంతేకాకుండా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి మీడియాతో మాట్లాడిన ఆయనను ఎందుకు పదవి నుంచి తొలగించకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది.

దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులోనూ ఏబీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ ను ఎత్తేస్తూ సుప్రీంకోర్టు దాదాపు నెల రోజుల క్రితం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసి 20 రోజులు కావస్తున్నా ఆయనకు జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనకు రావాల్సిన జీతభత్యాల మాట ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసిన నేపథ్యంలో తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన మళ్లీ కోరారు. అలాగే తనపై సస్పెన్షన్స్ విధించినప్పటి నుంచి రావాల్సిన పెండింగ్ జీతభత్యాలను కూడా చెల్లించాలన్నారు.

దీంతో సుప్రీంకోర్టు తీర్పు మేరకు జగన్‌ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ మే 18న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సూచించింది. తాజాగా ఆయనను ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్ స్టేషనరీ కొనుగోలు విభాగం కమిషనర్ గా నియమించింది.
Tags:    

Similar News