నిర్భయ స్నేహితుడు ఇప్పుడెక్కడ? ఏం చేస్తున్నాడు?

Update: 2019-12-19 12:01 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నిర్భయ ఉదంతం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన స్నేహితుడితో కలిసి నిర్భయ బస్సు ఎక్కటం.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమె బాయ్ ఫ్రెండ్ ను దారుణంగా కొట్టి.. ఆ తర్వాత నిర్భయను అనాగరికంగా గ్యాంగ్ రేప్ చేయటం.. కదులుతున్న బస్సు నుంచి ఆమెను కిందకు తోసేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఈ కేసులోని నిందితులు దోషులుగా సుప్రీంకోర్టు తేల్చి ఉరిశిక్షను ఖరారు చేసింది. త్వరలో వారికి ఉరిశిక్షను అమలు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నాడు నిర్భయతో ఉన్న ఆమె స్నేహితుడు ఇప్పుడెక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది మీడియా.

ఈ సందర్భంగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. యూపీలోని గోరఖ్ పూర్ లో ఉండే నిర్భయ స్నేహితుడి కుటుంబం.. మీడియాతో మాట్లాడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. మాట్లాడేందుకు నో చెప్పారు. నిర్భయ స్నేహితుడు తండ్రి ప్రతాప్ పాండేయ్ లాయర్ గా పని చేస్తుంటారు.

నిర్భయ స్నేహితుడు అవనీంద్ర ప్రస్తుతం మరో జీవితాన్ని గడుపుతున్నట్లు అతడి తండ్రి వెల్లడించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని.. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అయ్యిందని.. దోషులకు శిక్ష పడాలని అతడు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. అతగాడు ప్రస్తుతం రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఫూణెలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.


    

Tags:    

Similar News