శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ... అండ‌ర్ వేర్‌ల‌తో జ‌నం నిర‌స‌న‌

Update: 2022-05-09 03:11 GMT
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగుదేశం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మరోసారి అత్య‌వ‌స‌ర‌ పరిస్థితి విధించారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ ద్వీప దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇదో రెండోసారి. ఐదు వారాల క్రితం నిరసనకారులు అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు పెద్దఎత్తున గాయపడ్డారు. దీంతో ఆ సమయంలో అధ్యక్షుడు గొటబాయ కొన్నిరోజుల పాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.

తీవ్ర ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న నేపథ్యంలో రాజపక్స మ‌రోసారి ఎమ‌ర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. మ‌రోసారి ఇలా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించ‌డాన్ని ప్ర‌జ‌లు తీవ్రంగా భావిస్తున్నారు.

దీంతో లంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి.

ఈ క్ర‌మంలో విద్యార్థులు, యువ‌కులు, యువ‌తులు.. త‌మ అండ‌ర్ వేర్‌ల‌పై గొట‌బ‌య‌కు వ్య‌తిరేకంగా.. నినాదాలు రాసి.. నిర‌స‌న తెలుపుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి తోడు మరోవైపు శుక్రవారం వందల సంఖ్యలో నిరసనకారులు, విద్యార్థులు ఆ దేశ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులతో అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మరోసారి భద్రతా బలగాలకు అధికారం కల్పించారు.

మరోవైపు శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్‌ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.  

ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దయ్యాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు.
Tags:    

Similar News