వైసీపీ నేత‌ల‌పై వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు!

Update: 2022-10-11 07:55 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేనికీ గర్జనలు? అంటూ అక్టోబ‌ర్ 10న‌ ట్వీట్లతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఆయన.. అక్టోబ‌ర్ 11న‌ కూడా వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

ఇటీవ‌ల కాలంలో కార్టూన్ల ద్వారా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప‌వ‌న్ ఇరుకున‌పెడుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌ను కార్టూన్ల రూపంలో ప‌వ‌న్ ప్ర‌జ‌ల ముందుకు తెస్తున్నారు. కార్టూన్ల ద్వారా వైసీపీ ప్ర‌భుత్వ నేత‌ల‌ను విమ‌ర్శిస్తున్నారు.

తాజాగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని దక్షిణ డకోటాలోని "మౌంట్‌ రష్‌మోర్" చిత్రాన్ని జనసేనాని పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ- విశ్వాసాలకు "మౌంట్‌ రష్‌మోర్" ను చిహ్నంగా అభివర్ణించారు. విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌".. "ధన - వర్గ - కులస్వామ్యానికి చిహ్నం” పీఎస్‌ (బూతులకి కూడా…)  అంటూ జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ కార్టూన్‌లో విశాఖ రుషికొండ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్, జ‌ల వ‌న‌రుల శాఖ‌ మంత్రి అంబ‌టి రాంబాబు, కొడాలి నాని, త‌దిత‌రుల‌ను పోలిన‌వారి చిత్రాల‌ను ఉంచారు.  అదేవిధంగా ఆ కార్టూన్ కింద బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌లెత్తి ఆ న‌లుగురిని చూస్తూ ఉంటారు.

ఈ క్ర‌మంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో మాట్లాడుతున్న వ్య‌క్తి... డోంట్ వ‌ర్రీ సార్‌.. మ‌నం కూడా కొంచెం తిట్ల పురాణం మోతాదు పెంచితే.. త‌ర్వాత చాన్స్ మ‌న‌దేన‌ని చెబుతూ ఉంటాడు.

ఇప్పుడు ఈ కార్టూన్ వైర‌ల్ గా మారింది. జ‌న‌సైనికులు దీన్ని లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. కామెంటు పెడుతున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. ప్యాకేజీ ముట్టింద‌ని అందుకే ప‌వ‌న్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నార‌ని నిప్పులు చెరుగుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News