ఆ సామాజికవర్గంపై పవన్‌ ప్రత్యేక దృష్టి!

Update: 2023-01-10 05:03 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ఈసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం మొత్తం జనసేనతో నడుస్తుందని విశ్లేషకులు తమ అభిప్రాయాలు వెలువరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల విమర్శలు కూడా ఈ దిశగానే ఉన్నాయి. పవన్‌ కాపులను గంపగుత్తగా చంద్రబాబుకు అమ్మేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు చీలిపోయాయి. 70కి పైగా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.. కాపులు. 2019లో జగన్‌ కు అత్యధికంగా కాపులు మద్దతిచ్చారు. యువత మాత్రం జనసేనతోనే నడిచింది. ఈసారి మాత్రం కాపు ఓటు బ్యాంకులో చీలిక ఉండదని కాపులంతా పవన్‌ కే జై కొడతారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ సైతం వేరే సామాజికవర్గాలపై దృష్టి సారించారు. మొదటి నుంచి కూడా పవన్‌ రెండు కులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎస్సీల్లో చాలా వెనుకబడి ఉన్న రెల్లి కులస్తులకు, అలాగే ఏపీలో కోస్తా తీర ప్రాంతం అంతా విస్తరించి ఉన్న మత్స్యకారులపై పవన్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరురుస్తున్నారు. వాస్తవానికి మత్స్యకారుల్లో చాలామంది మెగాభిమానులేనని చెబుతున్నారు. అందులోనూ పవన్‌ అంటే మత్స్యకార యువతకు ప్రత్యేక అభిమానం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మత్స్యకార సమస్యలపై పవన్‌ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మత్య్సకారుల వలసలను నివారించి.. వారికి జెట్టీలు నిర్మిస్తే రాష్ట్రంలోనే వేటకు అనుకూలంగా ఉంటుందని పవన్‌ చెబుతున్నారు.

అలాగే వారి బోట్లకు అతి తక్కువకే డీజిల్‌ ను అందించడంతోపాటు ఆక్వా పరిశ్రమలకు అతి తక్కువ రేటుకే విద్యుత్‌ అందించాలని, ప్రమాదవశాత్తూ మృతి చెందిన గంగపుత్రులకు భారీ పరిహారం అందిస్తామని చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్టే జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే జనసేన యువశక్తి సభకు పెద్ద ఎత్తున మత్స్యకారులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీకాకుళం జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ ను నమ్మొద్దని ప్రచారం చేసి వచ్చారు. ఈ సభకు యవకులు హాజరు కాకుండా జిల్లా మంత్రి హోదాలో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. జనసేన పార్టీ మత్స్యకారులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెబుతున్నారు. యువశక్తి సభలో మత్స్యకారుల సమస్యలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సభ జరిగే శ్రీకాకుళం జిల్లా రణస్థలం వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధానికి రణస్థలంగా మారుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి,

వాస్తవానికి జనసేన పార్టీ మత్స్యకారులకు దగ్గరవుతుండటంతోనే అదే వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజుకు రెండో విడతలో వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో చోటు కల్పించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే మత్స్యకారుల్లో తనపై ఉన్న అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునేలా పవన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువశక్తి సభల్లో మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలను ఆయన ప్రస్తావిస్తారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News