గంజాయితో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన పోలీసులు !

Update: 2021-11-03 11:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో యథేచ్ఛగా గంజాయి రవాణా అవుతోంది. పోలీసులు తనిఖీలు చేపడుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ క్రమంలో గంజాయి సాగు, అక్రమ రవాణా వెనక రాజకీయ నేతలు, అధికారుల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొందరు కానిస్టేబుళ్లు గంజాయిని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఈ సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలా సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గంజాయి అమ్ముతూ రాంబాబు అనే వ్యక్తి ఖమ్మం ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. రాంబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖమ్మం అర్బన్‌ పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా డికాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో 5 కిలోల గంజాయితో ఖమ్మం ఏఆర్‌ కానిస్టేబుల్ సతీష్ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న వెంకట్ కూడా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు ఈ ఆపరేషన్‌లో తేలింది.

ఒరిస్సా నుంచి రాజు అనే వ్యక్తి ద్వారా ఈ గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరితో పాటు మరి కొంతమంది పోలీస్ శాఖకు చెందిన వారు గంజాయి రవాణాలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో భద్రాచలం CI డ్రైవర్ గా పనిచేసిన కానిస్టేబుల్ వెంకట్.. ఆసమయంలోనే గంజాయి స్మగ్లర్లతో పరిచయం పెంచుకున్నాడు. అప్పుడే ఈ అక్రమ వ్యాపారంలోకి ప్రవేశించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వెంకట్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతనిని పట్టుకుంటే మరికొందరు గంజాయి దొంగలు బయటపడే అవకాశం ఉంది.



Tags:    

Similar News