పోలీసాఫీసర్లే ఉగ్రవాదులయ్యారు

Update: 2015-10-15 10:44 GMT
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు... ఆ ఉగ్రవాదులెవరన్నది గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. ఎన్ కౌంటర్లో మృతిచెందిన ఉగ్రవాదులిద్దరూ ఒకప్పుడు పోలీసు అధికారులే కావడంతో అంతా ఆశర్యపోయారు.

వీరిద్దరూ దోడా జిల్లాలో గత సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో పోలీస్‌ విధుల నుంచి ఆయుధాలతో సహా తప్పించుకున్నారు. ఆ తరువాత ఉగ్రవాదులతో చేతులు కలిపి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన గులాం నబీ మాంగ్‌నూ అలియాస్‌ మౌల్వీ, రియాజ్‌లు గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు లొంగిపోయి అప్రూవర్‌గా మారడంతో ఆర్మీకి సహాయం అందించేందుకు ప్రత్యేక పోలీస్‌ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. కాగా నేడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారిరువురు మృతి చెందగా, వారి వద్ద ఏకే 47, ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌, ఇతర మందు గుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది.

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు పాల్గొన్న ఉదంతాలు గతంలో బయటపడ్డాయి. తాజాగా పోలీసు శాఖలో పనిచేసినవారూ ఉగ్రవాదుల్లో కలిసిపోవడం... ఎన్ కౌంటర్ లో హతమవడంసంచలనం కలిగిస్తోంది.
Tags:    

Similar News