అగ్రరాజ్యంలో హాహాకారాలు.. రోడ్డెక్కి నిరసనలు

Update: 2020-05-03 03:30 GMT
పేరుకు అగ్రరాజ్యం.. ప్రపంచానికి పెద్దన్న.. కానీ లోపల మాత్రం డొల్ల.. ‘మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న చందంగా మారింది అమెరికా పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు కోటలు దాటుతున్నాయి. తొందరగా కోలుకుంటాం.. ఆర్థిక వ్యవస్థకు బిలయన్ల ప్యాకేజీ ఇచ్చాం..  మళ్లీ పుంజుకుంటామంటూ తను పడుతున్న కష్టాన్ని ఏకరువు పెడుతున్నారు. కానీ అగ్రరాజ్యంలో తాజాగా ఆకలికేకలు.. రుణభారంతో అమెరికన్లు లాక్ డౌన్ ఉల్లంఘించి మరీ తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సంచలనంగా మారింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోనే ఈ దుస్థితి దాపురించడం నిజంగా అధ్యక్షుడు ట్రంప్ వైఫల్యమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

* నిరుద్యోగ అమెరికా..లాక్డౌన్ తో  రోడ్డున పడ్డ జీవితాలు

ప్రపంచంలోనే అత్యధిక కేసులు.. మరణాలు సంభవిస్తున్న దేశం అమెరికా.. అందులో ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోనైతే మరణ మృదంగం వినిపిస్తోంది.  వేల మంది చావులు.. లక్షల మరణాలు సంభవించాయి. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 66వేల మంది కరోనా కాటుకు చనిపోయారు.. 11 లక్షలమందికి పైగా వైరస్ సోకింది.  అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 3 కోట్ల మంది నిరుద్యోగ ప్రయోజనం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసేయడంతో రోడ్డున పడ్డారు. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తీసేశాయి. ఇక  లాక్ డౌన్ తో ఆర్థిక భారం మోయలేక కొన్ని కంపెనీలు శాశ్వతంగా మూతపడ్డాయి. కరోనా ఎఫెక్ట్ అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.

*అమెరికన్ల హాహాకారాలు.. రోడ్డెక్కి నిరసనలు

కరోనా వైరస్ తో లాక్ డౌన్ విధించడం.. ఉపాధి కోల్పోవడం.. ఉద్యోగాలు లేక అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే మే1న అందరూ ఇంటి అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ఓనర్లు అందరూ అడిగేస్తారు. దీంతో ఉద్యోగం.. ఉపాధి లేని అమెరికన్లకు వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో మే 1 కార్మిక దినోత్సవం రోజున అమెరికాలో ప్రజలంతా రోడ్డెక్కారు.. నిరసనలు వెల్లువెత్తాయి.  ముఖ్యంగా అగ్రరాజ్యం ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో ప్రజలు అధిక సంఖ్యలో రోడ్డపైకి వచ్చారు. ‘నో మనీ.. నో రెంట్’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగుల హక్కులను కాపాడాలని.. ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇంటి అద్దెలు కూడా చెల్లించే స్థితిలో లేమని నిరసనకారులు ఆందోళన చేశారు. ఇంటిఅద్దెలు రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనకారులకు ప్రతిపక్ష నాయకులు కూడా మద్దతు పలికారు.

*ట్రంప్ బిలియన్ల ఆర్థిక ప్యాకేజీలు ఏమైనట్టు?

కరోనా ప్రబలడం.. వేల మంది చనిపోవడంతో ట్రంప్ సర్కార్ బిలియన్ల ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. కానీ అవి ఎవరికి చేరాయి.. ఎక్కడికిపోయాయి.. కంపెనీలకు వెళ్లాయా..? అవి కార్మికులు, ఉద్యోగులకు పంచాయా? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇంత పెద్ద ప్యాకేజీలు చేశామంటున్న ట్రంప్ సర్కార్.. మరి అదే నిజమైతే అంత మంది నిరుద్యోగులు తమను ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక అంతమంది అద్దెలు చెల్లించలేమంటూ వెంటనే దీనిపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయినా ట్రంప్ సర్కార్ కు చీమకుట్టినట్టు అయినా లేకపోవడంపై ప్రజలు.. నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ట్రంప్ కొంపముంచడం ఖాయమా?

కరోనా ప్రబలుతోంది. వేలమంది మరణిస్తున్నారు. లాక్ డౌన్ తో ఉద్యోగ, ఉపాధి పోయామని అందరూ రోడ్డెక్కుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చైనాపై దుమ్మెత్తిపోయడానికి.. విమర్శకులపై నోరుపారేసుకోవడానికి.. వచ్చే నవంబర్ లో ఎన్నికలపై మాట్లాడడం అమెరికన్ల పుండుపై కారం చల్లినట్టు అవుతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునే చర్యలు మాని ప్రతీ చర్యలోనూ రాజకీయం వెతుక్కుంటూ ఓట్ల వేట సాగిస్తున్న ట్రంప్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ ఖాయమంటున్నారు. ఇప్పటికే కరోనా కట్టడిలో ట్రంప్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో కరోనా కేసులు పెరిగాయని.. లాక్ డౌన్ విధించకుండా ఆయన తప్పు చేశారని అంటున్నారు. కేవలం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రజల ప్రాణాలను ట్రంప్ బలిపెట్టాడనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

*పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్

 ట్రంప్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతోందని తేలింది. ఇదే సమయంలో ఈయనకు ప్రధాన పోటీదారు అయిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు పెరుగుతోంది. తాజాగా అక్కడ నిర్వహించిన నేషనల్ పోల్ లో ట్రంప్ కంటే బైడెన్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యం చూపారు. దాంతో ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  ‘యూఎస్ఏ టుడే-సఫ్లోక్ యూనివర్సిటీ పోల్’లో పాల్గొన్న వారిలో 42శాతం మంది అమెరికా అధ్యక్ష రేసులో జోబైడెన్ కు ఓటు వేశారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైపు కేవలం 36శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉంది.

ఇలా కరోనా ఎఫెక్ట్ లో చరుకుగా వ్యవహరించని ట్రంప్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. మరోవైపు రోడ్డెక్కుతున్న అమెరికన్ల వైఖరి వివాదానికి కారణమవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ విస్తరిస్తూ న్యూయార్క్ లో ప్రాణాలు తీస్తున్న వేళ జనాలు అవేవీ లెక్కచేయకుండా రోడ్డెక్కడం ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతోంది.. తమకు ప్రాణాల కంటే డబ్బు - ఆర్థిక ఇబ్బందులే ఎక్కువన్న అమెరికన్ల వైఖరి మారనంత వరకు అక్కడ కరోనా తగ్గడం అసాధ్యమంటున్నారు.. చూడాలి మరీ అమెరికాను.. మాట వినని అక్కడి ప్రజలు - నాయకులను ఆ దేవుడే కాపాడాలి.

  


Tags:    

Similar News